Drone attack : అరేబియా సముద్రంలో.. భారత్ వస్తున్న నౌకపై డ్రోన్ దాడి!
ABN , Publish Date - Dec 24 , 2023 | 04:00 AM
ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ నౌకలను హౌతీ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని, దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో అరేబియా సముద్రంలోనూ అలాంటి ఘటన చోటుచేసుకుంది.
వాణిజ్య నౌకలో భారీ మంటలు.. నష్టం
నౌకలో 21 మంది ఇండియన్స్
గుజరాత్ తీరానికి దగ్గర్లో ఘటన
వెంటనే స్పందించిన కోస్ట్గార్డ్స్
ఐసీజీఎ్స-విక్రమ్ మోహరింపు
హౌతీలకు ఇరాన్ సాయం?
గాజాపై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం
న్యూఢిల్లీ/జెరూసలేం, డిసెంబరు 23: ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ నౌకలను హౌతీ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని, దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో అరేబియా సముద్రంలోనూ అలాంటి ఘటన చోటుచేసుకుంది. శనివారం గుజరాత్లోని పోరుబందర్ పోర్టుకు 217 నాటికల్ మైళ్ల దూరంలో లైబీరియా జెండాతో ఉన్న వాణిజ్య నౌక (ఎంవీ షెమ్ ప్లూటో)పై డ్రోన్ (యూఏవీ)తో క్షిపణి దాడి జరిగింది. ఈ విషయాన్ని బ్రిటన్ ఆర్మీకి చెందిన యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్(యూకేఎంటీవో) గుర్తించింది. ఇజ్రాయెల్కు అనుబంధంగా పనిచేస్తున్న ఆ నౌక సౌదీ అరేబియా నుంచి చమురుతో భారత్లోని మంగళూరు పోర్టుకు చేరాల్సి ఉంది. డ్రోన్ దాడిలో నౌకకు నిప్పంటుకుందని, లోపల చమురు/రసాయనాల కారణంగా మంటలు వేగంగా వ్యాపించినట్లు వివరించింది. ఈ ఘటన భారత ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్కు ఆవల జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే భారత కోస్ట్గార్డ్స్ రంగంలోకి దిగారు. భారత నౌకాదళం కూడా సహాయక చర్యల కోసం ఐసీజీఎ్స-విక్రమ్ను రంగంలోకి దింపింది. మంటలు అదుపులోకి వచ్చాయని, నౌకలోని సిబ్బంది అంతా క్షేమమని నేవీ అధికారులు వివరించారు. డ్రోన్ దాడి జరగ్గానే నౌక సిబ్బంది ‘ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్’ను ఆపివేశారు. దీంతో ఆ నౌకను త్వరగా గుర్తించలేకపోయామని, కోస్ట్గార్డ్ హెలికాప్టర్లతో గాలించామని చెప్పారు. నౌకలో 21 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపారు. కాగా.. ఈ దాడికి ఏ సంస్థ కూడా తమదే బాధ్యత అని ప్రకటించలేదు.
హౌతీలకు ఇరాన్ ఇంటెలిజెన్స్!
ఎర్రసముద్రంలో యెమెన్ తీరంలో.. ఇరాన్ మద్దతున్న హౌతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ నౌకలను టార్గెట్గా చేసుకుని దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే..! హమా్సకు మద్దతు ప్రకటించిన హౌతీలు.. ఇప్పటి వరకు పలు నౌకలపై క్షిపణి, డ్రోన్ దాడులు చేయగా.. కొన్ని నౌకలను హైజాక్ చేశాయి. అయితే.. హౌతీలకు పకడ్బందీ నెట్వర్క్ లేదని, వారికి ఇరాన్ పారామిలటరీకి చెందిన ఇంటెలిజెన్స్ విభాగం సహకరిస్తోందని పేర్కొంటూ వాల్స్ట్రీట్ జర్నల్ శనివారం ఓ కథనాన్ని ప్రచురించింది. ఇరాన్ పారామిలటరీకి చెందిన గూఢచార నౌక.. ఇజ్రాయెల్, ఆ దేశంతో సంబంధమున్న నౌకలను ట్రాక్ చేసి.. హౌతీలకు సమాచారాన్ని చేరవేస్తోందని పేర్కొంది. ‘‘పలు నౌకలు తమ ట్రాకింగ్ వ్యవస్థను స్విచాఫ్ చేసుకుని, ఇంటర్నెట్ను నిలిపివేసినా.. హౌతీలు అత్యంత కచ్చితత్వంతో క్షిపణి దాడులు చేస్తున్నారు. హౌతీలకు రాడార్ టెక్నాలజీ లేదు. ఇరాన్ సాయం లేకపోతే.. వారు ఈ దాడులు చేయగలిగేవారు కాదు’’ అని ఆ కథనం స్పష్టం చేసింది. 2021లో ఇరాన్ గూఢచార నౌకను ఇజ్రాయెల్ నాశనం చేసిందని, దాంతో ఇరాన్ పారామిలటరీ విభాగం హౌతీలకు సాయం చేస్తోందని పేర్కొంది. అమెరికా, బ్రిటిష్, ఫ్రెంచ్ నౌకాదళాలు మాత్రం హౌతీల డ్రోన్లు, క్షిపణులను కూల్చివేశాయని వివరించింది.
గాజాలో ఒకే కుటుంబంలో 76 మంది మృతి
గాజాపై దాడులను ఇజ్రాయెల్ ముమ్మరం చేసింది. శుక్రవారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్స జరిపిన దాడుల్లో ఒకే కుటుంబానికి చెందిన 16 ఉప కుటుంబాల్లోని 76 మంది మృతిచెందినట్లు గాజా ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. ఈ విషయాన్ని యూఎన్డీపీ కూడా నిర్ధారించింది. ఈ దాడిలో చనిపోయిన వారిలో యూఎన్డీపీమాజీఈ అధికారి ఇసామ్-అల్-ముఘరబీ కూడా ఉన్నట్లు తెలిపింది.