Disease X: ‘డిసీజ్ X’ ఒక ఊహాజనిత దొంగ లాంటిది.. నిపుణులు ఇచ్చిన షాకింగ్ రిపోర్ట్

ABN , First Publish Date - 2023-10-02T21:30:45+05:30 IST

రెండేళ్ల పాటు యావత్ ప్రపంచాన్ని స్తంభింపజేసిన కరోనా తరహాలోనే మరో మహమ్మారి రాబోతోందని.. ఓ వార్త కొన్ని రోజుల నుంచి తెగ చక్కర్లు కొడుతోంది. డిసీజ్ ఎక్స్ రూపంలో వచ్చే ఈ మహమ్మారి, కరోనాని మించి ఎక్కువ ప్రభావం...

Disease X: ‘డిసీజ్ X’ ఒక ఊహాజనిత దొంగ లాంటిది.. నిపుణులు ఇచ్చిన షాకింగ్ రిపోర్ట్

రెండేళ్ల పాటు యావత్ ప్రపంచాన్ని స్తంభింపజేసిన కరోనా తరహాలోనే మరో మహమ్మారి రాబోతోందని.. ఓ వార్త కొన్ని రోజుల నుంచి తెగ చక్కర్లు కొడుతోంది. డిసీజ్ ఎక్స్ రూపంలో వచ్చే ఈ మహమ్మారి, కరోనాని మించి ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని, లక్షల మందిని పొట్టన పెట్టుకునే ప్రమాదం పొంచి ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు చెప్పారు. దీంతో.. ప్రజలు ఇప్పటి నుంచే భయాందోళనలకు గురవ్వడం ప్రారంభించారు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటుంటే, అప్పుడే మరో మహమ్మారి రాబోతోందా? అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే.. ఇప్పుడు భయాలను దూరం చేసేలా కొందరు నిపుణులు ఒక మంచి రిపోర్ట్ అందించారు. డిసీజ్ ఎక్స్ లాంటి మహమ్మారి ప్రస్తుతానికి వ్యాప్తిలో లేదని, భవిష్యత్తులో వచ్చే అవకాశం కూడా లేదని ఆ నిపుణులు పేర్కొంటున్నారు. ఇది కేవలం ఊహాజనిత ముప్పు మాత్రమేనంటూ కొట్టిపారేశారు. అశోకా విశ్వవిద్యాలయంలోని బయోసైన్సెస్ & హెల్త్ రీసెర్చ్ డీన్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ మాట్లాడుతూ.. డిసీజ్ X అనేది కేవలం ఊహాత్మక దృశ్యమన్నారు. ఈ వ్యాధి ఇప్పుడే వ్యాప్తిలో లేదన్నారు. అయితే.. భవిష్యత్తులో ఏవైనా మహమ్మారులు వచ్చినప్పుడు, ఈ కసరత్తు అందుకు ఉపయోగపడుతుందని వివరించారు. అంటే.. ఇప్పటి నుంచే భవిష్యత్తుకు సిద్ధంగా ఉండటానికి ఇది దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.


ఇదే సమయంలో నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోడా మాట్లాడుతూ.. ఈ డిసీజ్ ఎక్స్‌ని ఊహాజనిత దొంగతో పోల్చారు. ‘‘మీ ఇంట్లోకి దొంగలు రాకపోవచ్చు. కానీ, వస్తారేమోనన్న భయంతో మీరు సీసీటీవీలు ఏర్పాటు చేసుకుంటారు. ఇంటికి తాళం వేసుకోవడమే కాకుండా కాపలా కోసం ఒక శునకాన్ని కొంటారు. ఈ డిసీజ్‌ ఎక్స్‌ కూడా అలాంటిదే. దొంగ వస్తాడేమో అనే ఊహ వంటిదే. అయితే.. భవిష్యత్తులో ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సన్నద్ధత చాలా అవసరం’’ అని అన్నారు. మరో ముప్పు వస్తుందేమోనని.. దాన్ని ఎదుర్కోవడం కోసం శాస్త్రవేత్తలు ఇప్పటి నుంచి సిద్ధం అవుతున్నారని, ఇలాంటి కసరత్తు మంచిదేనని చెప్పుకొచ్చారు.

ఇదిలావుండగా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా కొత్త మహమ్మారి వస్తే, దాన్ని ఎదుర్కోవడం కోసం సిద్ధంగా ఉండాలని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఈ క్రమంలోనే.. డిసీజ్ ఎక్స్ రావొచ్చన్న పుకార్లు ఊపందుకున్నాయి. కరోనా మహమ్మారి తరహాలో.. డిసీజ్‌ ఎక్స్‌ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిపై ప్రభావం చూపుతుందని బ్రిటన్‌ వ్యాక్సిన్‌ టాస్క్‌ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తున్న డేమ్‌ కేట్‌ బింగ్‌హామ్‌ చెప్పినట్లు బ్రిటన్ మీడియాలో వార్తలూ వచ్చాయి. కరోనా కంటే ఇది 7 రెట్ల ప్రభావం చూపిస్తుందని కూడా కథనలొచ్చాయి. దీంతో.. ప్రజలు ఆందోళన చెందారు. కానీ.. అలాంటి ఆందోళన అవసరం లేదంటూ తాజాగా నిపుణులు ఊరట కల్పించారు.

Updated Date - 2023-10-02T21:30:45+05:30 IST