Discount 200 on LPG : వంటగ్యాస్‌ సిలిండర్‌పై రూ.200 తగ్గింపు

ABN , First Publish Date - 2023-08-30T04:33:59+05:30 IST

తెలంగాణ, మధ్యప్రదేశ్‌ సహా.. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను రూ.200 మేర తగ్గించింది.

Discount 200 on LPG : వంటగ్యాస్‌ సిలిండర్‌పై రూ.200 తగ్గింపు

  • ఉజ్వల సిలిండర్లకు మరో రూ.200 సబ్సిడీ

  • కేంద్ర క్యాబినెట్‌ భేటీలో ప్రధాని నిర్ణయం

  • నేటి నుంచి అమల్లోకి కొత్త ధరలు

  • ప్రధాని రాఖీ కానుక: కేంద్ర మంత్రి ఠాకూర్‌

  • పేద, మధ్యతరగతికి ప్రయోజనం: మోదీ

  • ఎన్నికల స్టంటేనంటున్న విపక్షాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ, మధ్యప్రదేశ్‌ సహా.. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను రూ.200 మేర తగ్గించింది. మంగళవారం జరిగిన కేంద్ర క్యాబినెట్‌ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్‌ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వివరాలను వెల్లడించారు. ‘‘ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.200 ధర తగ్గించాం. ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్నవారికి మరో రూ.200 సబ్సిడీ ఉంటుంది. ప్రస్తుతం ఢిల్లీలో గ్యాస్‌ ధర రూ.1,103గా ఉండగా.. అది రూ.903కు తగ్గుతుంది. ఈ నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి వస్తుంది. ప్రధాని మోదీ మహిళలకు ఇచ్చిన రాఖీ, ఓనం కానుక ఇది’’ అని ఆయన చెప్పారు. తాజా నిర్ణయంతో 31 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని, వారిలో 9.6 కోట్ల మంది ఉజ్వల లబ్ధిదారులని ఆయన తెలిపారు. ఉజ్వల కనెక్షన్‌ దరఖాస్తులు 75 లక్షల దాకా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరలో క్లియర్‌ చేస్తామని పేర్కొన్నారు. గ్యాస్‌ బండ ధర తగ్గింపుపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. ‘‘ఇది దేశంలోని సోదరీమణులకు ఇస్తున్న రక్షాబంధన్‌ కానుక. మా ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల జీవన నాణ్యతను పెంచడం.. పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనాలు కలిగే నిర్ణయాలను తీసుకుంటుంది’’ అని ఆయన పేర్కొన్నారు. కాగా.. జూలైలో చివరిసారి రూ.50 మేర గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగ్గా.. అంతకు ముందు మే నెలలో రెండుసార్లు ధరలు పెరగడం గమనార్హం. కేంద్రం తాజా నిర్ణయంపై కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్‌, ధర్మేంద్రప్రధాన్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా హర్షం వ్యక్తం చేశారు.

చంద్రయాన్‌-3పై..

చంద్రయాన్‌-3 విజయవంతమవ్వడంపైనా క్యాబినెట్‌ భేటీలో చర్చ జరిగింది. ఇస్రో శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలుపుతూ మంత్రివర్గం తీర్మానం చేసింది. ఇది ఒక్క ఇస్రో విజయం మాత్రమే కాదని, భారతదేశం గర్వించిన విషయమని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై తొలిసారి కాలుపెట్టిన దేశంగా భారత్‌ నిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు.

ఎన్నికల స్టంట్‌: విపక్షాలు

కేంద్రం గ్యాస్‌బండ ధరలను తగ్గించడాన్ని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఎన్నికల స్టంట్‌ అని విమర్శించారు. విపక్ష కూటమి-ఇండియా సాధించిన విజయమని వ్యాఖ్యానించారు. ‘‘రెండు నెలల్లో ఇండియా కూటమి రెండు విజయవంతమైన సమావేశాలను ఏర్పాటు చేసింది. రెండ్రోజుల్లో మరో సమావేశం జరగనుంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దాంతో.. ఎన్డీయే గ్యాస్‌ ధరను కొంత తగ్గించింది’’ అని ఆమె ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్‌ కూడా ప్రధాని తన సీటును కాపాడుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని, రాబోయే రోజుల్లో మరిన్ని తాయిలాలు ఉంటాయన్నారు. ఎల్పీజీ ధరలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణమే కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని గద్దెదించిందని, అక్కడ తమ సర్కారు 100 రోజుల్లో ఐదు ప్రధాన హామీలను నెరవేర్చిందన్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ సర్కారు రూ.500కే ఎల్‌పీజీ సిలిండర్‌ను ఇస్తోందని, దాన్ని చూసే ఇప్పుడు కేంద్రం ధరలను తగ్గించిందన్నారు. ఎన్సీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ సుప్రియా సూలె రూ.200 తగ్గింపు ఏ మూలకూ సరిపోదని, కేంద్రానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. రూ.500-రూ.700 వరకు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం తాజా ప్రకటన కేవలం ‘ఎన్నికల మాయ’ అని అన్నారు. ఇండియా కూటమి ఒత్తిడితోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ అన్నారు. టీఎంసీ అధికార ప్రతినిధి కుశాల్‌ ఘోష్‌ కూడా ఈ నిర్ణయాన్ని ఎన్నికల గిమ్మిక్కుగా అభివర్ణించారు.

Updated Date - 2023-08-30T05:23:49+05:30 IST