Share News

టీకాంగ్రెస్‌ బాధ్యత దీపాదాస్‌ మున్షీకి

ABN , Publish Date - Dec 24 , 2023 | 04:51 AM

సార్వత్రక ఎన్నికలకు వేగంగా సమాయత్తమవుతున్న కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగతంగా భారీ మార్పులను చేపట్టింది.

టీకాంగ్రెస్‌ బాధ్యత దీపాదాస్‌ మున్షీకి

కేరళ ఇన్‌చార్జిగా ఉన్న ఆమెకు తెలంగాణ అదనపు బాధ్యతలు.. ఎన్నికల సమయంలో కీలక పాత్ర

ఠాక్రేకు గోవా బాధ్యతలు.. ఏపీకి మాణిక్కం ఠాగూర్‌

దేశవ్యాప్తంగా కాంగ్రె్‌సలో భారీగా సంస్థాగత మార్పులు

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): సార్వత్రక ఎన్నికలకు వేగంగా సమాయత్తమవుతున్న కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగతంగా భారీ మార్పులను చేపట్టింది. 12 మంది ప్రధాన కార్యదర్శులతోపాటు 11 రాష్ట్రాలకు ఇన్‌చార్జిలను నియమించింది. వివిధ రాష్ట్రాలకు పార్టీ ఇన్‌చార్జులను మార్చింది. ఇందులో భాగంగా.. ఇప్పుటి దాకా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న మాణిక్‌రావ్‌ ఠాక్రేను మార్చింది. పార్టీ కేరళ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీకి అదనంగా తెలంగాణ బాధ్యతలు అప్పగించింది. ఠాక్రేను గోవా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమించింది. ఇప్పటి దాకా గోవా బాధ్యతలు చూస్తున్న మాణిక్కం ఠాగూర్‌కు ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. నిజానికి, తెలంగాణకు అదనపు ఇన్‌చార్జిగా నియమితులైన దీపాదాస్‌ మున్షీ.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించారు. ఎన్నికలకు సంబంధించి ఏఐసీసీ ముఖ్య పరిశీలకురాలిగా వచ్చిన ఆమె.. అసంతృప్తులను బుజ్జగించడం, అలిగిన నేతలకు తగిన హామీలు ఇవ్వడం వంటివి చేశారు. ఫలితంగా ఆమెకు ఇక్కడి పరిణామాలన్నింటిపైనా అవగాహన ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సాధారణ మార్పుల్లో భాగంగా ఠాక్రేను గోవాకు పంపిన అధిష్ఠానం.. తెలంగాణకు పూర్తిస్థాయి ఇన్‌చార్జిని నియమించే వరకూ అదనపు బాధ్యతలను దీపాదాస్‌ మున్షీకి అప్పగించింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షునిగానూ కొనసాగుతున్నారు. పార్లమెంటు ఎన్నికలయ్యే వరకూ ఆయననే టీపీసీసీ అధ్యక్షుడిగానూ కొనసాగించనున్నట్లూ చెబుతున్నారు. టీపీసీసీకి కొత్త అధ్యక్షుడి నియామకం జరిగే వరకూ దీపాదాస్‌ మున్షీనే అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

యూపీ బాధ్యతల నుంచి ప్రియాంకకు విముక్తి

దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనూ పార్టీ ఇన్‌చార్జులను కాంగ్రెస్‌ అధిష్ఠానం మార్చింది. ఇప్పటి వరకూ ఉత్తరప్రదేశ్‌ ఇన్‌చార్జిగా ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని ఆ బాధ్యతల నుంచి తప్పించింది. దేశవ్యాప్తంగా ప్రచారం చేయాల్సి ఉండడంతో ఆమెకు నిర్ధిష్ట రాష్ట్ర బాధ్యత అప్పగించలేదు. ఆమె స్థానంలో యూపీ బాధ్యతను మహారాష్ట్రకు చెందిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అవినాశ్‌ పాండేకు అప్పగించింది. సచిన్‌ పైలట్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించి ఆయనకు ఛత్తీ్‌సగఢ్‌ బాధ్యతలు అప్పగించింది. అలాగే, ముకుల్‌ వాస్నిక్‌కు గుజరాత్‌, జీఏ మిర్‌కు జార్ఖండ్‌తోపాటు పశ్చిమ బెంగాల్‌ అదనపు బాధ్యత కూడా ఇచ్చింది. హరియాణా నేత కుమారి షెల్జాకు ఉత్తరాఖండ్‌, కేరళ నేత రమేశ్‌ చెన్నితాలకు మహారాష్ట్ర పార్టీ వ్యవహారాలను కేటాయించింది. అసోంతోపాటు మధ్యప్రదేశ్‌ అదనపు ఇన్‌చార్జిగా జితేందర్‌ సింగ్‌, కర్ణాటక ఇన్‌చార్జిగా రణదీప్‌ సూర్జేవాలాను నియమించింది. ఇక, ఢిల్లీతోపాటు హరియాణా అదనపు ఇన్‌చార్జిగా దీపక్‌ బబరియాను నియమిస్తే.. మోహన్‌ ప్రకాశ్‌కు బిహార్‌, చెల్లకుమార్‌కు మేఘాలయ, మిజోరం, అరుణాచల్‌ ప్రదేశ్‌, అజయ్‌ కుమార్‌కు ఒడిసాతోపాటు తమిళనాడు, పుదుచ్చేరి అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. భర త్‌ సింగ్‌ సోలంకికి జమ్ము కశ్మీర్‌; రాజీవ్‌ శుక్లాకు హిమాచల్‌ ప్రదేశ్‌, చండీఘర్‌; సుఽఖీందర్‌ సింగ్‌ రంధావాకు రాజస్థాన్‌; దేవేందర్‌ యాదవ్‌కు పంజాబ్‌; గిరీశ్‌ చంద్రశేఖర్‌కు త్రిపుర, సిక్కిం, మణిపూర్‌, నాగాలాండ్‌ బాఽధ్యతలు కేటాయించింది. ఎప్పటి మాదిరే ప్రఽధాన కార్యదర్శుల్లో కేసీ వేణుగోపాల్‌ సంస్థాగత వ్యవహారాలు, జయరాం రమేశ్‌ కమ్యూనికేషన్‌ బాధ్యతలు నిర్వర్తిస్తారు. అజయ్‌ మాకెన్‌ కోశాధికారిగా, మిలింద్‌ దేవర, విజయ్‌ ఇందర్‌ సింగ్‌ సంయుక్త కోశాధికారులుగా వ్యవహరిస్తారు. కాగా తారిఖ్‌ అన్వర్‌ను ప్రధాన కార్యదర్శిగా; భక్త చరణ్‌ దాస్‌, హరీశ్‌ చౌదరి, రజనీ పాటిల్‌, మనీష్‌ చత్రాలను రాష్ట్రాల ఇన్‌చార్జి పదవుల నుంచి తొలగించారు.

Updated Date - Dec 24 , 2023 | 04:51 AM