అతీక్, అష్రఫ్ హత్య గ్యాంగ్స్టర్లుగా మారేందుకే
ABN , First Publish Date - 2023-04-17T03:14:14+05:30 IST
‘‘మేం ఎంతకాలం చిన్నచిన్న షూటర్లుగా ఉండిపోవాలి? గ్యాంగ్స్టర్లుగా, మాఫియా డాన్లుగా ఎదగాలంటే అతీక్, అష్రఫ్ లాంటి వారిని చంపాలి. అప్పుడే జనాలకు మేమేంటో తెలుస్తుంది. అందుకే పక్కా ప్లాన్తో వారిని చంపేశాం’’.. ఉత్తరప్రదేశ్కు చెందిన గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్,
పోలీసు కస్టడీలో నిందితుల వెల్లడి.. హత్యకు రెండ్రోజులుగా ప్లాన్.. రెక్కీ
నిందితులకు 14 రోజుల రిమాండ్
ప్రయాగ్రాజ్/లఖ్నవూ, ఏప్రిల్ 16: ‘‘మేం ఎంతకాలం చిన్నచిన్న షూటర్లుగా ఉండిపోవాలి? గ్యాంగ్స్టర్లుగా, మాఫియా డాన్లుగా ఎదగాలంటే అతీక్, అష్రఫ్ లాంటి వారిని చంపాలి. అప్పుడే జనాలకు మేమేంటో తెలుస్తుంది. అందుకే పక్కా ప్లాన్తో వారిని చంపేశాం’’.. ఉత్తరప్రదేశ్కు చెందిన గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్లను హతమార్చిన అరుణ్ మౌర్య(18), సన్నీ(23), లవ్లేశ్(22) పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఇది. తన సోదరుడు జైల్లో ఉండగా.. అతనిపై అతీక్ దాడి చేశాడని, అందుకు ప్రతీకారమే శనివారం నాటి చర్య అని సన్నీ చెప్పగా.. అతీక్కు పాకిస్థాన్, ఐఎ్సఐ, లష్కరే తాయిబా ఉగ్ర సంస్థతో సంబంధాలున్నందునే అతణ్ని చంపాలనుకున్నట్లు లవ్లేశ్ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించినట్లు తెలిసింది. అందుకే వారిని చంపగానే ‘జై శ్రీరామ్’ అనే నినాదాలిచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఒకలా ఉంటే.. ఆర్థిక నేరగాళ్లెవరైనా సుపారీ ఇచ్చి అతీక్, అష్ర్ఫలను చంపించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ముగ్గురు నిందితులు వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు. గతంలో జైలు చరిత్రను చూసినా.. వీరు ఎక్కడా కలుసుకునే అవకాశాలు లేవు. లవ్లేశ్ తివారీ బందాకు చెందినవాడు. అరుణ్ మౌర్యది కాస్గంజ్. సన్నీది హమీర్పూర్. అతీక్, అష్ర్ఫలను హతమార్చే విషయంలో వారి లక్ష్యం స్పష్టంగా ఉందని పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. అతీక్కు వందల మందితో శత్రుత్వం ఉందని, వారిలో ఎవరైనా ఈ ముగ్గురికీ సుపారీ ఇచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. శుక్రవారం ధూమన్గంజ్ పోలీ్సస్టేషన్లో విచారణ సందర్భంగా.. ఆ తర్వాత కోర్టులోనూ అతీక్ తనకు పలువురు బడా వ్యక్తులు, బిల్డర్లు, రాజకీయ నాయకులతో సంబంధం ఉందని వాంగ్మూలం ఇచ్చాడు. 200కు పైగా షెల్ కంపెనీల ద్వారా నల్ల ధనాన్ని వైట్గా మార్చినట్లు అంగీకరించాడు. ఈ క్రమంలో 50 షెల్ కంపెనీలకు చెందిన యజమానుల పేర్లను చెప్పాడు. మిగతా వారి పేర్లు కూడా బయట పడతాయేమో అనే అనుమానంతో.. ఆర్థిక నేరగాళ్లు సుపారీ హత్యకు ప్లాన్ చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
పక్కా ప్లాన్తో..!
అతీక్, అష్ర్ఫలను నిందితులు పక్కా ప్లాన్తో హతమార్చినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అతీక్, అష్ర్ఫలు పోలీసు కస్టడీలో ఉన్నారని తెలియగానే.. తమ ప్లాన్ను అమలు చేశారని చెప్పారు. అరుణ్, సన్నీ, లవ్లేశ్ రెండు గురువారమే ఓ లాడ్జిలో బస చేశారని, వారిలో ఒకరు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నట్లు, మిగతా ఇద్దరు తమనుతాము విద్యార్థులుగా చెప్పుకొన్నారని వివరించారు. శుక్రవారం ఆస్పత్రిలో రెక్కీ వేశారని చెప్పారు. శనివారం అతీక్, అష్ర్ఫలను ఆస్పత్రికి తీసుకువచ్చేప్పుడు మీడియా ముసుగులో తమ ప్లాన్ను అమలు చేయాలనే ఉద్దేశంతో ఫేక్ ఐడీకార్డులు, డమ్మీ కెమెరా, డమ్మీ మైక్ను సిద్ధం చేసుకున్నారని చెప్పారు. అరుణ్ వాడిన తుపాకీ తుర్కియే మేడ్ జిగానా పిస్టల్ అని గుర్తించినట్లు తెలిపారు. పాకిస్థాన్ మీదుగా ఆ తుపాకీ భారత్కు చేరి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భారత్లో ఈ పిస్టల్ నిషేధం ఉంది. ప్రయాగ్రాజ్ మెజిస్ట్రేట్ నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించగా.. వారిని నైనీ సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా, సీఎం యోగి ప్రకటించినట్లు ప్రభుత్వం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అర్వింద్ కుమార్ త్రిపాఠీ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల జ్యుడీషియల్ కమిటీని నియమించింది. మరో వైపు ఈ హత్యలపై సుప్రీం కోర్టులో పిల్ దాఖలైంది.
పోలీసుల వైఫల్యం..!
అతీక్, అష్ర్ఫలు కరడుగట్టిన గ్యాంగ్స్టర్లు. నిజానికి పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తులను మీడియాతో మాట్లాడించకూడదు. కానీ, ప్రయాగ్రాజ్ పోలీసులు వీరిద్దరి విషయంలో ఆ నిబంధనను ఉల్లంఘించారు. పైగా.. శుక్రవారం నాటి అతీక్ వాగ్మూలంలో తనకు పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎ్సఐ, ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబాతో సంబంధాలున్నట్లు చెప్పాడు. అంటే.. వారికి టెర్రర్ లింకులు, మనీలాండరింగ్తో ప్రమేయమున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో సాధారణంగా పోలీసులు వారిని టెర్రరిస్టులుగా పరిగణించి, ఇతరులతో కలవకుండా జాగ్రత్త పడతారు. కానీ, శనివారం రాత్రి జరిగిన ఘటనలో పోలీసులు భద్రతను పూర్తిగా విస్మరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
మట్టిలో కలిసిన గ్యాంగ్స్టర్
అతీక్, అష్రఫ్ సోదరుల పోస్టుమార్టం ఆదివారం మధ్యాహ్నం పూర్తయింది. నలుగురు వైద్యుల బృందం, వీడియోగ్రఫీ మధ్య నిర్వహించిన పోస్టుమార్టంలో అతీక్ శరీరంలో 8, అష్రఫ్ శరీరంలో 5 బుల్లెట్లు లభించినట్లు తేలింది. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కసరీమసారీ శ్మశానవాటికలో వీరిద్దరి అంత్యక్రియలు జరిగాయి.