Assembly: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

ABN , First Publish Date - 2023-01-08T07:36:54+05:30 IST

కొత్త యేడాదిలో తొలి అసెంబ్లీ సమావేశాలు(Assembly meetings) సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర గవర్నర్‌

Assembly: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

చెన్నై, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): కొత్త యేడాదిలో తొలి అసెంబ్లీ సమావేశాలు(Assembly meetings) సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభమై రెండుమూడు రోజులపాటు జరుగుతాయి. ప్రతియేటా జనవరి మొదటివారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం ఆనవాయితీ. ఆ మేరకు సోమవారం ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభమవుతుంది. గవర్నర్‌ ప్రసంగం అనంతరం ఆంగ్ల ప్రసంగ పాఠం తమిళ అనువాదాన్ని స్పీకర్‌ అప్పావు వినిపిస్తారు. సోమవారం మధ్యాహ్నం స్పీకర్‌ ఛాంబర్‌లో సభా వ్యవహారాల కమిటీ సమావేశమై శాసనసభ సమావేశాలు ఎన్నిరోజులపాటు నిర్వహించాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయాన్ని స్పీకర్‌ అప్పావు మీడియా సమావేశంలో ప్రకటించనున్నారు. మంగళవారం మళ్ళీ ప్రారంభమయ్యే శాసనసభ.. ఇటీవల మృతి చెందిన మాజీ నేతలకు సంతాపం ప్రకటించి, నివాళులర్పించనుంది. ఆ తర్వాత ఈ నెల 11, 12 తేదీల్లో శాసనసభ సమావేశాలు యథావిధిగా జరిగే అవకాశముంది. ఈ నెల 11న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రతిపాదించి ప్రసంగించనున్నారు. ఈ నెల 12 వరకు గవర్నర్‌ ప్రసంగంపై సభ్యుల మధ్య చర్చ జరిగే అవకాశముందని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతుండటంతో అసెంబ్లీలో హాలును సిబ్బంది సిద్ధం చేస్తున్నారు.

Updated Date - 2023-01-08T07:36:57+05:30 IST