Aditya-L1 : ఆదిత్య అదుర్స్‌

ABN , First Publish Date - 2023-09-03T03:28:02+05:30 IST

అద్భుతం ఆవిష్కృతమైంది. ఇస్రో జైత్రయాత్రలో మరో ఘనత వచ్చి చేరింది. సూర్యుడిపై అధ్యయనం కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ఆదిత్య-ఎల్‌1 సోలార్‌ మిషన్‌లో తొలి ఘట్టం విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌

 Aditya-L1 : ఆదిత్య అదుర్స్‌

  • నిప్పులు చిమ్ముతూ నిప్పుల గుండానికి..

  • ఆదిత్య-ఎల్‌1లో తొలి ఘట్టం విజయవంతం

  • ఉపగ్రహాన్ని భూకక్ష్యలోకి చేర్చిన పీఎ్‌సఎల్వీ-సీ57

  • నాలుగు దశల్లో గురి తప్పకుండా దూసుకెళ్లిన రాకెట్‌

  • భూకక్ష్యలో తిరుగుతూ ఆపై సూర్యుడి వైపు పయనం

  • 125 రోజుల అనంతరం ఎల్‌1 కక్ష్యలోకి ఆదిత్య

  • ‘ప్రజ్ఞాన్‌’ సెంచరీ జాబిల్లిపై రోవర్‌ 100 మీటర్ల ప్రయాణం

  • అక్కడి నుంచి సూర్యుడిపై అధ్యయనం

చంద్రయాన్‌-3 విజయంతో భారత్‌ చరిత్ర సృష్టించింది. ఇక వాట్‌ నెక్ట్స్‌..? అనేలోపే.. ఇస్రో సూర్యుడిపై గురిపెట్టింది. తొలిసారిగా ఆదిత్యుడిపై అధ్యయనం కోసం ఆదిత్య-ఎల్‌1 ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. 125 రోజులు.. 15 లక్షల కిలోమీటర్ల పాటు సాగే ఈ సుదీర్ఘ యాత్రలో తొలి అడుగు ఘనంగా పడింది. కోట్లాది భారతీయు ఆశలను మోసుకుంటూ నింగిలోకి ఎగిరిన పీఎస్‌ఎల్వీ-సీ57 రాకెట్‌ ఆదిత్య-ఎల్‌1ను నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. దీంతో ఈ ప్రయోగం తొలి ఘట్టం విజయవంతమైనట్టు ఇస్రో ప్రకటించింది.

సూళ్లూరుపేట, బెంగళూరు, సెప్టెంబరు 2: అద్భుతం ఆవిష్కృతమైంది. ఇస్రో జైత్రయాత్రలో మరో ఘనత వచ్చి చేరింది. సూర్యుడిపై అధ్యయనం కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ఆదిత్య-ఎల్‌1 సోలార్‌ మిషన్‌లో తొలి ఘట్టం విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి శనివారం ఉదయం 11:50 గంటలకు ఆదిత్య-ఎల్‌1ను తీసుకుని నింగిలోకి ఎగిరిన పీఎ్‌సఎల్వీ-సీ57 రాకెట్‌ ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్దేశిత భూకక్ష్యలోకి చేరవేసింది. శుక్రవారం మధ్యాహ్నం 12:10 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ శనివారం ఉదయం 11:50 గంటలకు ముగియగానే షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎ్‌సఎల్వీ-సీ57 రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగిరింది. 63 నిమిషాలపాటు సాగిన ఈ ప్రయాణంలో నాలుగు దశలను సునాయాసంగా పూర్తిచేసుకున్న రాకెట్‌.. శిఖర భాగాన ఉన్న ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది. మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సూపర్‌ కంప్యూటర్ల ద్వారా రాకెట్‌ గమనాన్ని వీక్షిస్తున్న ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌.. ఆదిత్య-ఎల్‌1 మిషన్‌ ప్రయోగం విజయవంతమైందని ప్రకటించారు. అక్కడే ఉన్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ను, శాస్త్రవేత్తలను ఆలింగనం చేసుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహం భూకక్ష్యలోనే 16 రోజుల పాటు తిరుగుతుంది. ఇలా భూమి చుట్టూ నాలుగుసార్లు తిరిగిన తరువాత సూర్యుడి దిశగా పయనించనుంది. ఆదిత్య-ఎల్‌1 మొత్తం 125 రోజులపాటు ప్రయాణించి సూర్యుడి దిశగా ఉన్న ఎల్‌-1 బిందువు ఉన్న లాగ్రేంజియన్‌ కక్ష్యలోకి చేరుకుంటుంది. 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఈ ప్రదేశంలోకి భారత్‌ ఉపగ్రహ ప్రయోగం చేపట్టడం ఇదే తొలిసారి.

63 నిమిషాలు ఎందుకంటే..?

సాధారణంగా పీఎ్‌సఎల్వీ రాకెట్లు.. నింగిలోకి దూసుకెళ్లిన 25 నిమిషాల్లోనే వ్యోమనౌకలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెడతాయి. కానీ.. పీఎ్‌సఎల్వీ-సీ57 రాకెట్‌ మాత్రం దీనికోసం ఏకంగా 63 నిమిషాల సమయం తీసుకుంది. ఆ తర్వాతే రాకెట్‌ నుంచి ఆదిత్య-ఎల్‌1 విడిపోయింది. ఇప్పటి వరకు ఇస్రో చేపట్టిన పీఎ్‌సఎల్వీ సుదీర్ఘ మిషన్లలో ఇది కూడా ఒకటి. దీనికి కారణం ఏమిటనే ప్రశ్నకు విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (వీఎ్‌సఎ్‌ససీ) డైరెక్టర్‌ ఎస్‌ ఉన్నికృష్ణన్‌ నాయర్‌ సమాధానమిచ్చారు. ‘‘వ్యోమనౌక ఒక నిర్దిష్ట ఏవోపీ (ఆర్గుమెంట్‌ ఆఫ్‌ పెరెజీ)ని కోరుతుంది. ఏవోపీని ఎదుర్కొనేందుకు పీఎ్‌సఎల్వీ రాకెట్‌ చివరి దశ (పీఎ్‌స4)ను ఒకేసారి చేపట్టలేదు. సాధారణ కక్ష్యకు చేరినప్పుడు పీఎ్‌స4ను 30 సెకన్లపాటు మండించి... ఆ తర్వాత మనకు అవసరమైన ఏవోపీ వచ్చేవరకు అక్కడే వేచి ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత రాకెట్‌ నుంచి స్పేస్‌ క్రాఫ్ట్‌ విడిపోవడానికి ముందు పీఎ్‌స4ను మళ్లీ మండించాం. ఏవోపీ సాధించిన తర్వాతే ఉపగ్రహం విడిపోతుంది కాబట్టి దీనికి 63 నిమిషాల సమయం పట్టింది’ అని చెప్పారు.

సూర్యుడికి ఎంత దగ్గరగా వెళ్తుందంటే..?

ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-3 చందమామ ఉపరితలంపై దిగింది. అయితే ఆదిత్య-ఎల్‌1 మాత్రం సూర్యుడిపై దిగదు. ఎందుకంటే అక్కడ మండే ఉష్ణోగ్రతలను ఇది తట్టుకోలేదు. అందుకే సూర్యుడిని పరిశీలించేందుకు దీన్ని సూర్య-భూ వ్యవస్థ కక్ష్యలోనే ఉంచనున్నారు. భూమి నుంచి సూర్యుడికి మధ్య దూరం 15 కోట్ల కిలోమీటర్లు కాగా.. ఆదిత్య-ఎల్‌1 వెళ్లేది 15 లక్షల కిలోమీటర్ల వరకు మాత్రమే. అంటే భూమి నుంచి సూర్యుడికి మధ్య ఉన్న దూరంలో ఇది ఒక వంతు మాత్రమే. అక్కడి లాగ్రేంజియన్‌ (ఎల్‌1) కక్ష్య నుంచి ఇది సూర్యుడిపై పరిశోధనలు చేస్తుంది. ఆదిత్య-ఎల్‌1లో ఉండే ఏడు పేలోడ్లు సూర్యుడి పొరలైన ఫొటోస్పియర్‌, క్రోమోస్పియర్‌, సౌర కరోనాను అధ్యయనం చేస్తాయి. అలాగే సౌర జ్వాలలు, సౌర రేణువుల గురించి ఎన్నో అంశాలను శోధిస్తాయి.

రోజుకి 1440 ఫొటోలు పంపే వీఈఎల్‌సీ

ఆదిత్య-ఎల్‌1 మొత్తం ఏడు పేలోడ్లను తీసుకుని నింగిలోకి ఎగిరింది. వాటిలో ముఖ్యమైనది. విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రాఫ్‌ (వీఈఎల్‌సీ). ఈ మిషన్‌లో ఇదే అత్యంత క్లిష్టమైన సాధనం. దీని బరువు 190 కిలోలు. ఇది నిర్దేశిత కక్ష్యకు చేరుకున్నాక రోజుకు 1440 ఫొటోలు తీసి ఇస్రోకు పంపుతుంది. ఇది ఐదేళ్లపాటు సేవలందిస్తుంది. ఇంధనం మిగిలి ఉంటే మరింత ఎక్కువ కాలం పనిచేస్తుంది. దీంతోపాటు మరో ఆరు పేలోడ్లు దీనిలో ఉన్నాయి. సోలార్‌ ఆలా్ట్రవైలెట్‌ ఇమేజింగ్‌ టెలీస్కోప్‌... అనేది సూర్యుడిలోని ఫొటోస్పియర్‌, క్రోమోస్పియర్‌ ప్రాంతాలను చిత్రీకరిస్తుంది. తద్వారా సౌర రేడియోధార్మికతను కొలుస్తుంది. సోలార్‌ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెకో్ట్రమీటర్‌ (సొలెక్సెస్‌), హై ఎనర్జీ ఎల్‌1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెకో్ట్రమీటర్‌ (హెచ్‌ఈఎల్‌1 ఓస్‌).. ఈ రెండూ సూర్యుడి నుంచి వెలువడే ఎక్స్‌రే జ్వాలలను అధ్యయనం చేస్తాయి. ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (ఆస్పెక్స్‌), ప్లాస్మా ఎనలైజర్‌ ప్యాకేజ్‌ ఫర్‌ ఆదిత్య (పాపా).. ఈ రెండు పరికరాలు సౌర గాలులు, ఆవేశిత అయాన్లు, వాటిలో శక్తి విస్తర తీరుని పరిశీలిస్తాయి. ఇక మాగ్నెటోమీటర్‌.. ఎల్‌1 బిందువు వద్ద అయస్కాంత క్షేత్రాలను అధ్యయనం చేస్తుంది.

ఆదిత్య-ఎల్‌1 ఎందుకు..?

భారత దేశపు మొట్టమొదటి సౌర అన్వేషణ మిషన్‌కు ఇస్రో ఆదిత్య-ఎల్‌1 అని పేరు పెట్టింది. సూర్యుడిపై అధ్యయనం చేయడం ఈ మిషన్‌ ప్రధాన లక్ష్యం. సంస్కృతంలో ఆదిత్య అంటే సూర్యుడు. ఇక ఎల్‌1 అనేది సూర్యు-భూమి వ్యవస్థలో కీలకమైన స్థానమైన లాగ్రేంజ్‌ పాయింట్‌1ను సూచిస్తుంది. ఇది భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకే ఈ మిషన్‌కు ఆదిత్య-ఎల్‌1 అనే పేరుపెట్టారు. ‘ఎల్‌1 అనేది సూర్యుడు, భూమి వంటి రెండు ఖగోళ వస్తువుల గురుత్వాకర్షణ బలాలు సమతాస్థితిలో ఉన్న అంతరిక్షంలోని ఒక ప్రదేశం. దీనివల్ల అక్కడ ఉంచిన ఒక వస్తువు రెండు ఖగోళ వస్తువులకు సంబంధించి సాపేక్షంగా స్థిరంగా ఉంటుంది’ అని ఇస్రో పేర్కొంది.

కిక్కిరిసిన విజిటర్స్‌ గ్యాలరీ

ఆదిత్య-ఎల్‌1 ప్రయోగ నేపథ్యంలో షార్‌లో సందడి వాతావరణం నెలకొంది. ఎండ మండిపోతున్నా లెక్కచేయకుండా గొడుగులు వేసుకొని మరీ షార్‌కు జనం క్యూ కట్టారు. ఏపీ, తమిళనాడు, తెలంగాణ తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో హాజరై గ్యాలరీ నుంచి ప్రయోగాన్ని వీక్షించారు. సందర్శకుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్పులు ఏర్పాటు చేసింది. సూళ్లూరుపేట నుంచి శ్రీహరికోటకు వెళ్లే మార్గమంతా వాహనాలు బారులు తీరాయి. పాసులు లేని వారు వేనాడు రోడ్డు మార్గం, పులికాట్‌ సరస్సు అంచున నిలబడి ప్రయోగాన్ని వీక్షించారు.

2somnath.jpg

సమష్టి కృషితోనే విజయం: సోమనాథ్‌

దేశమంతా చంద్రయాన్‌-3 విజయోత్సవాలు జరుపుకొంటున్న వేళ మరో విజయం నమోదు కావడం ఆనందంగా ఉందని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ అన్నారు. ఆదిత్య-ఎల్‌1 ప్రయోగం అనంతరం ఆయన మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి మాట్లాడుతూ.. శాస్త్రవేత్తల సమష్టి కృషితోనే ఇంతటి భారీ విజయం లభించిందన్నారు. పీఎ్‌సఎల్వీ-సీ57 రాకెట్‌ నుంచి ఆదిత్య-ఎల్‌1 విజయవంతంగా విడిపోయిందని, దాన్ని దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడానికి సహకరించిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. నాలుగో దశలో ఇంజన్‌ను రెండుసార్లు నిలిపి రీస్టార్ట్‌ చేశామని, దీని వల్ల ప్రయోగం 63 నిమిషాలపాటు సాగిందని చెప్పారు. కాగా, ఆదిత్య-ఎల్‌1 ప్రయోగం సమష్టి విజయమని ఉపగ్రహ ప్రాజెక్టు డైరెక్టర్‌ నిగర్‌ షాజీ, మిషన్‌ డైరెక్టర్‌ ఎస్‌ఆర్‌ బిజు అన్నారు. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు దాదాపు 15 ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామన్నారు. ఎన్నో ఏళ్లు, ఎందరో శాస్త్రవేత్తల శ్రమ ఫలితంగా నేడు విజయం దక్కిందన్నారు. ఆదిత్య విజయాన్ని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రి జితేంద్ర సింగ్‌ దేశం గర్వించదగ్గ రోజని అభివర్ణించారు. ప్రయోగాన్ని ఆయన షార్‌ నుంచి స్వయంగా వీక్షించారు.

Updated Date - 2023-09-03T03:28:02+05:30 IST