అయోధ్యకు వెయ్యి రైళ్లు
ABN , Publish Date - Dec 17 , 2023 | 05:43 AM
అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని దేశం నలుమూలల నుంచి మొదటి 100రోజుల పాటు వెయ్యికి పైగా రైళ్లను నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది.
న్యూఢిల్లీ, డిసెంబరు 16: అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని దేశం నలుమూలల నుంచి మొదటి 100రోజుల పాటు వెయ్యికి పైగా రైళ్లను నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. భక్తులు అయోధ్యకు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఆలయం ప్రారంభోత్సవానికి కొన్ని రోజుల ముందు... జనవరి 19నుంచే ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అయోధ్య రైల్వేస్టేషన్లో ఆధునీకరణ పనులు చేపట్టారు. రోజుకు 50వేల మంది రాకపోకలు సాగించే సామర్థ్యంతో అభివృద్ధి చేసిన ఈ స్టేషన్ జనవరి 15 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. మరోవైపు అయోధ్యను సందర్శించే యాత్రికులకు 24గంటలూ కేటరింగ్ సేవలు అందించడానికి ఐఆర్సీటీసీ సన్నద్ధమైంది. కాగా, జనవరి 22న మధ్యాహ్నం 12గంటలకు శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందని రామమందిర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఆలయ పరిసరాల్లో రద్దీని నివారించడానికి 22న భక్తులు అయోధ్యకు రావొద్దని, తమకు సమీపంలోని మందిరాల్లో ‘ఆనంద్ మహోత్సవ్’ను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.