కాంగ్రెస్కు 9-11 ఎంపీ సీట్లు!
ABN , Publish Date - Dec 26 , 2023 | 12:52 AM
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పైచేయి సాధించిన కాంగ్రెస్ పార్టీ.. వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ ఆధిపత్యం కొనసాగించనుందని ఏబీపీ న్యూస్-సీవోటర్ సర్వే చెబుతోంది.
తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లోనూ పై‘చేయి’
కేంద్రంలో ఎన్డీఏకు 295-335 స్థానాలు
165-205 సీట్లకే ఇండియా కూటమి పరిమితం
ఏబీపీ న్యూస్, సీ-ఓటర్ ఒపీనియన్ పోల్లో వెల్లడి
న్యూఢిల్లీ, డిసెంబరు 25: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పైచేయి సాధించిన కాంగ్రెస్ పార్టీ.. వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ ఆధిపత్యం కొనసాగించనుందని ఏబీపీ న్యూస్-సీవోటర్ సర్వే చెబుతోంది. రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాలకుగాను కాంగ్రెస్ కూటమి 9-11 సీట్లు గెలుస్తుందని ఈ సర్వే పేర్కొంది. అయితే కేంద్రంలో మరోసారి నరేంద్రమోదీ ప్రభుత్వమే రానుందని, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి స్పష్టమైన మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలిపింది. 2024 పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం 543 లోక్సభ స్థానాలకుగాను ఎన్డీఏ 295-335 సీట్లు గెలుచుకుంటుందని చెప్పింది. కాంగ్రె్సతో కూడిన ప్రతిపక్ష ఇండియా కూటమి గతంలో కన్నా మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందని, కానీ.. 165-205 స్థానాలకే ఆ కూటమి పరిమితమవుతుందని పేర్కొంది. దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఒపీనియన్ పోల్లో ఓటర్ల నుంచి ఈ మేరకు అభిప్రాయాలు వ్యక్తమైనట్లు ఏబీపీ-సీవోటర్ వెల్లడించింది. ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకు ఈ సర్వే చేపట్టినట్లు తెలిపింది. ఉత్తరాదిలో అత్యధిక రాష్ట్రాలతోపాటు బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్డీఏ కూటమి మెజారిటీ సీట్లు దక్కించుకుంటుందని పేర్కొంది. కానీ, తెలంగాణ సహా మహారాష్ట్ర, బిహార్, పంజాబ్ రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్ కూటమి పైచేయి సాధిస్తుందని స్పష్టం చేసింది. ఎన్డీఏకు బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్లో 27-29, ఛత్తీ్సగఢ్లో 9-11, రాజస్థాన్లో 23-25, ఉత్తరప్రదేశ్లో 73-75 సీట్లు వస్తాయని వివరించింది. ఈ రాష్ట్రాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి 0-2 చొప్పున సీట్లలో మాత్రమే గెలుస్తుందని చెప్పడం గమనార్హం. దక్షిణాదిలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ బీజేపీ 22-24 స్థానాలు గెలుచుకుంటుందని, కాంగ్రె్సకు 4-6 స్థానాలు మాత్రమే వస్తాయని పేర్కొంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ కూటమి 9-11 సీట్లు గెలుస్తుందని, బిహార్లో 21-23, మహారాష్ట్రలో 26-28, పంజాబ్లో 5-7 సీట్లు ఇండియా కూటమి దక్కించుకుంటుందని తెలిపింది. కాగా, బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ 23-25 స్థానాల్లో విజయం సాధిస్తుందని, కాంగ్రె్స-వామపక్షాలు 0-2 సీట్లకే పరిమితమవుతాయని సర్వే తేలినట్లు చెప్పింది. ఈరాష్ట్రంలో బీజేపీ 16-18స్థానాలు వస్తాయని పేర్కొంది.