బ్రిక్స్లోకి మరో 6 దేశాలు
ABN , First Publish Date - 2023-08-25T03:37:15+05:30 IST
బ్రిక్స్ కూటమి విస్తరించింది. కొత్తగా అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీఅరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లను సభ్యదేశాలుగా చేర్చుకుంది.
అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా,
ఇరాన్, సౌదీ, యూఏఈలతో విస్తరణ
బ్రిక్స్ ప్లస్గా పేరు మార్పు?.. భవిష్యత్తులో మరిన్ని దేశాలు!
జోహానె్సబర్గ్, ఆగస్టు 24: బ్రిక్స్ కూటమి విస్తరించింది. కొత్తగా అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీఅరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లను సభ్యదేశాలుగా చేర్చుకుంది. దక్షిణాఫ్రికా రాజధాని జోహానె్సబర్గ్లో జరుగుతున్న బ్రిక్స్ 15వ శిఖరాగ్ర సదస్సు చివరిరోజైన గురువారం దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఈ విషయాన్ని ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఇది అమలులోకి వస్తుందన్నారు. గత కొంతకాలంగా బ్రిక్స్ తొలిదశ విస్తరణపై చర్చలు జరుగుతున్నాయని, ప్రస్తుతం ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని దేశాలను చేర్చుకునే అవకాశం ఉందని పేర్కొంటూ.. మలిదశ విస్తరణలుంటాయని తెలిపారు. కొత్తగా ఏ దేశాలను చేర్చుకోవచ్చన్నదానిపై సభ్య దేశాల విదేశాంగమంత్రులు కసరత్తు జరిపి, తదుపరి సదస్సులోగా ప్రతిపాదనలు తెలియజేయాలని నిర్దేశించామన్నారు. స్థానిక కరెన్సీలు, చెల్లింపు విధానాలపై కూడా అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సభ్యదేశాల ఆర్థికమంత్రులు, సెంట్రల్బ్యాంకు గవర్నర్లకు తెలియజేశామన్నారు. బ్రిక్స్ విస్తరణపై ప్రధాని మోదీ స్పందిస్తూ, ఈ ప్రతిపాదనకు భారత్ ముందునుంచీ మద్దతు ఇస్తోందని, విస్తరణ వల్ల బ్రిక్స్ మరింత బలోపేతమవుతుందని.. బహుళధ్రువ ప్రపంచం పట్ల పలు దేశాల విశ్వాసం పెరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా మారుతున్న కాలంతోపాటు మారాలని బ్రిక్స్ విస్తరణ సందేశమిస్తోందని చెప్పారు. చైనా అధినేత జిన్పింగ్ స్పందిస్తూ.. బ్రిక్స్లోని సహకార ప్రక్రియకు కొత్త ఉత్తేజాన్ని తీసుకురావటమేగాక ప్రపంచ శాంతికి, అభివృద్ధికి ఈ పరిణామం తోడ్పడుతుందన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ, బ్రిక్స్ విస్తరణను స్వాగతించారు. కొత్త సభ్యదేశాల చేరికతో కూటమి పేరును బ్రిక్స్ ప్లస్ అని వ్యవహరించవచ్చని వార్తలు వెలువడ్డాయికానీ, అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. 2006లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనాలతో కలిసి బ్రిక్ కూటమి ఏర్పడింది. 2010లో దక్షిణాఫ్రికాకు సభ్యత్వం ఇవ్వటంతో బ్రిక్స్గా మారింది.
మోదీ, జిన్పింగ్ చర్చలు
బ్రిక్స్ సదస్సు ఆఖరి రోజున మోదీ, జిన్పింగ్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్-చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖకు (ఎల్ఏసీకి) సంబంధించిన వివాదాస్పద అంశాలపై భారత్ ఆందోళనను మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. ఇరుదేశాల సంబంధాలు సాధారణస్థితికి చేరాలంటే వాస్తవాధీనరేఖను గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలను వేగవంతం చేయాలని, ఈ మేరకు సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేయాలని మోదీ, జిన్పింగ్ నిర్ణయించారు. ఈ వివరాలను భారత విదేశాంగశాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా వెల్లడించారు. అంతకుముందు మోదీ, జిన్పింగ్ బ్రిక్స్ వేదికపైకి వస్తున్న సమయంలో మాట్లాడుకుంటూ రావటం కనిపించింది. వేదికపై బ్రిక్స్ సదస్సు ఉమ్మడి ప్రకటన అనంతరం మళ్లీ వారిద్దరూ కరచాలనం చేశారు.