Pakistan: ఓ పక్క ఆకలితో అలమటించిపోతుంటే.. పాకిస్థాన్ చేసిన పని ఇదీ!

ABN , First Publish Date - 2023-01-23T19:24:13+05:30 IST

పాకిస్థాన్‌లో ఎక్కడ చూసినా జనం ఆకలి కేకలు వినిపిస్తున్నాయి.

Pakistan: ఓ పక్క ఆకలితో అలమటించిపోతుంటే.. పాకిస్థాన్ చేసిన పని ఇదీ!

కరాచీ: పాకిస్థాన్‌లో ఎక్కడ చూసినా జనం ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌( Pakistan)లో ప్రజల జీవనం రోజురోజుకు దుర్భరంగా మారుతోంది. ఇటీవల గోధుమ పిండితో వెళ్తున్న లారీని బైకులపై వెంబడించిన వేలాదిమంది ప్రాణాలకు తెగించి మరీ గోధుమ పిండిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గ్యాస్ సరఫరా లేకపోడంతో ప్రజలు మళ్లీ కట్టెలకు మారారు. కొందరు గ్యాస్‌ను ప్రమాదకరంగా ప్లాస్టిక్ సంచుల్లో నిల్వచేసుకుంటున్నారు.

ఓ వైపు పరిస్థితి ఇలా మరోవైపు, విలాసవంతమైన కార్లు(Luxery Cars), హై ఎండ్ ఎలక్ట్రిక్ వాహనాలు, వాటి విడిభాగాలను దిగుమతి చేసుకునేందుకు దేశం ఏకంగా 1.2 బిలియన్ డాలర్లు (రూ.259 బిలియన్లు) ఖర్చు చేసింది. తిండి లేక అల్లాడిపోతున్న వేళ కార్ల దిగుమతి ఏంటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

పాకిస్థాన్‌లో విదేశీ మారక నిల్వలు 4 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయాయి. ఫలితంగా నిత్యావసరాలను దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం నానా కష్టాలు పడుతోంది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో దేశ ప్రజలు ఇలా బిలియన్ల రూపాయలను లగ్జరీ కార్ల కోసం వెచ్చించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఆరు నెలల కాలంలో పాకిస్థాన్ 530.5 మిలియన్ డాలర్లు (రూ. 118.2 బిలియన్) విలువైన ‘కంప్లీట్లీ బిల్ట్ యూనిట్స్’ (CBU), ‘కంప్లీట్లీ నాక్‌డ్ డౌన్’/‘సెమీ నాక్‌డ్ డౌన్’(CKD/SKD)లను దిగుమతి చేసుకుంది. సీకేడీ కిట్లను దిగుమతి చేసుకునేందుకు అనుమతి లేకపోవడంతో వాటి కిట్లను దిగమతి చేసుకుంటోంది. ఫలితంగా స్థానిక పరిశ్రమలు దారుణంగా దెబ్బతింటున్నాయి. ప్రభుత్వం ఇటీవల లగ్జరీ కార్ల దిగుమతిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఫలితంగా దేశం నుంచి డాలర్ల ప్రవాహం కొనసాగింది.

Updated Date - 2023-01-23T19:24:15+05:30 IST