India Canada Row: యూకేలో భారత రాయబారికి చేదు అనుభవం.. ఖలిస్తానీ సానుభూతిపరులు అడ్డుకొని..

ABN , First Publish Date - 2023-09-30T15:27:09+05:30 IST

భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నప్పటి నుంచి ఖలిస్తానీ సానుభూతిపరులు పెట్రేగిపోతున్నారు. తమ చర్యలతో ఆందోళనకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో...

India Canada Row: యూకేలో భారత రాయబారికి చేదు అనుభవం.. ఖలిస్తానీ సానుభూతిపరులు అడ్డుకొని..

భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నప్పటి నుంచి ఖలిస్తానీ సానుభూతిపరులు పెట్రేగిపోతున్నారు. తమ చర్యలతో ఆందోళనకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉండొచ్చని కెనడా ప్రధాని ఆరోపణలు చేసినప్పటి నుంచే వాళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు వీళ్లు ఓ భారత రాయబారి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఆయన్ను స్కాట్లాండ్‌లోని గురుద్వారాలో ప్రవేశించకుండా అడ్డుకున్నారు.


ఆ వివరాల్లోకి వెళ్తే.. యూకేలోని భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి శుక్రవారం ఆల్బర్ట్ డ్రైవ్‌లోని గ్లాస్గో గురుద్వారా కమిటీ సభ్యులతో సమావేశం అయ్యేందుకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు ఖలిస్తానీ సానుభూతిపరులు అక్కడికి చేరుకొని.. ‘మీకు ఆహ్వానం లేదు’ అంటూ ఆయన్ను అడ్డుకున్నారు. అంతేకాదు.. గురుద్వారా సిబ్బందితో వాగ్వాదానికి కూడా దిగారు. దీంతో.. అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. చివరికి చేసేదేమీ లేక దొరైస్వామి అక్కడి నుంచి వెనక్కు వెళ్లిపోయారు. ఈ ఘటనపై వెంటనే స్కాట్లాండ్ పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అటు.. గురుద్వారా నిర్వాహకులు దొరైస్వామి క్షేమంగానే ఉన్నారని నిర్ధారించారు.

ఈ ఘటనపై ఓ యాక్టివిస్ట్ మాట్లాడుతూ.. కొంతమంది గురుద్వారా వద్దకు వచ్చి విక్రమ్ దొరైస్వామికి స్వాగతం పలకలేదన్నాడు. దాంతో అక్కడ స్వల్ప ఘర్షణ జరిగిందని, ఈ ఘటన పట్ల గురుద్వారా అసంతృప్తి చెంది ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కానీ.. భారతీయ అధికారులకు యూకేలోని ఏ గురుద్వారాలోనూ ప్రవేశం లేదని తేల్చి చెప్పాడు. భారత్, యూకే కుమ్మక్కుతో తాము విసిగిపోయామని, హర్దీప్ హత్య బ్రిటీష్ సిక్కులను టార్గెట్ చేశారని పేర్కొన్నాడు. మరోవైపు.. భారత ప్రభుత్వం ఈ ఘటనను యూకే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.

Updated Date - 2023-09-30T15:27:09+05:30 IST