Pakistani Beggars: విదేశాల్లో ఉన్న బిచ్చగాళ్లలో 90 శాతం పాకిస్తానీయులే.. జేబు దొంగల్లోనూ వాళ్లే ఎక్కువ!
ABN , First Publish Date - 2023-09-29T18:40:56+05:30 IST
ఒకప్పుడు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి బాగానే ఉండేది. మరీ ప్రపంచ దేశాలతో పోటీపడేంత గొప్ప స్థానంలో కాకపోయినా, చెప్పుకోదగిన పొజిషన్ని మెయింటెయిన్ చేసేది. కానీ.. ఇప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నంగా తయారయ్యాయి..
ఒకప్పుడు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి బాగానే ఉండేది. మరీ ప్రపంచ దేశాలతో పోటీపడేంత గొప్ప స్థానంలో కాకపోయినా, చెప్పుకోదగిన పొజిషన్ని మెయింటెయిన్ చేసేది. కానీ.. ఇప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నంగా తయారయ్యాయి. రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభం.. ఆ దేశాన్ని అతలాకుతలం చేసేశాయి. అవినీతి రాజ్యమేలడంతో.. పాక్ స్థితి దయనీయంగా మారింది. తినడానికి తిండి లేక అక్కడి జనాలు విలవిల్లాడుతున్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు పూర్తిగా నీరుగారిపోయాయి. దీంతో చేసేదేమీ లేక.. పాక్ దేశస్తులు పొట్టికూటి కోసం విదేశాల బాట పట్టారు. కానీ.. విదేశాల్లోనూ నిరాశే ఎదురవ్వడంతో.. మరో మార్గం లేక భిక్షాటననే తమ జీవనాధారంగా మార్చేసుకున్నారని నివేదికలు తెలుపుతున్నాయి.
అవును.. విదేశాల్లో అరెస్ట్ అవుతున్న బిచ్చగాళ్లలో ఏకంగా 90 శాతం మంది పాకిస్థానీయులే ఉన్నట్టు వెల్లడైంది. అంతేకాదు.. జేబు దొంగల్లోనూ అత్యధికంగా పాక్ జాతీయులే ఉన్నట్టు తేలింది. ఈ విషయాన్ని స్వయంగా పాక్ ప్రభుత్వమే వెల్లడించింది. విదేశాల్లో ఉంటున్న పాకిస్తానీలకు సంబంధించి అక్కడి సెనేట్లో చర్చ జరిగింది. ఈ చర్చల్లో భాగంగా.. పాకిస్తాన్కు చెందిన బిచ్చగాళ్లు భారీ సంఖ్యలో విదేశాలకు వెళ్తున్నారని, ఇది మానవ అక్రమ రవాణాకు ఊతమిస్తోందని విదేశాంగశాఖ సెక్రటరీ జుల్ఫికర్ హైదర్ సెనేట్ స్టాండింగ్ కమిటీకి వెళ్లడించారు.
పాక్లోని బిచ్చగాళ్లు యాత్రికుల వీసాని (ఉమ్రా వీసా) ఉపయోగించుకొని.. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ వంటి దేశాలకు తరలిపోతున్నారని వివరించారు. హరామ్ వంటి పవిత్ర స్థలాల్లో పట్టుబడిన జేబు దొందల్లో ఎక్కువమంది పాకిస్తానీయులే ఉన్నారన్నారు. ఒకప్పుడు వీళ్లు పశ్చిమాసియా దేశాలకు వెళ్లేవాళ్లని, ఇప్పుడు వారికి జపాన్ కొత్త గమ్యస్థానంగా మారుతోందని చెప్పారు. పాక్ విదేశీ మారకాన్ని పెంచుకోవాలంటే.. నైపుణ్యం కలిగిన కార్మికులను విదేశాలకు పంపించాల్సిన అవసరం ఉందన్న ఆయన.. సౌదీ అరేబియా నైపుణ్యం కలిగిన కార్మికులకే ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
ఇదే సమయంలో సెనేటర్ రానా మెహమూదుల్ హసన్ మాట్లాడుతూ.. జపాన్ లాంటి దేశాలు సైతం నైపుణ్యం కలిగిన కార్మికులనే కోరుకుంటోందన్నారు. ఇండియా, నేపాల్, పాకిస్తాన్ నుంచి వివిధ విభాగాల్లో నైపుణ్యం కలిగిన వాళ్లు అక్కడికి వెళ్తున్నారన్నారు. ప్రస్తుతం పాకిస్థాన్లో 50వేల మంది ఇంజినీర్లు నిరుద్యోగులుగా ఉన్నారని కూడా వెల్లడించారు. సౌదీ అరేబియాలో మూడు మిలియన్లు, UAEలో 1.5 మిలియన్లు, ఖతార్లో సుమారు 200,000 మంది పాకిస్తానీయులు ఉన్నారన్నారు. భారత్ చంద్రుడిని చేరుకుంటే.. పాకిస్థాన్ మాత్రం ప్రతిరోజు పొరపాట్లు చేస్తూనే ఉందన్నారు.
ప్రస్తుతం పాకిస్తాన్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉంది కాబట్టి.. పాకిస్తాన్ ఇంజినీర్లకు సహాయం చేసేందుకు జపాన్, చైనా వంటి దేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేలా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సంబంధిత ఏజెన్సీలతో చర్చలు జరిపితే బాగుంటుందని జుల్ఫికర్ హైదర్ కోరారు. పాక్లో మంచి నైపుణ్యం ఇంజినీర్లు కేవలం 15 నుంచి 20 వేలు మాత్రమే జీతాలు అందుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. పాకిస్తాన్ నుంచి యాత్రికుల వీసాతో వస్తున్న బిచ్చగాళ్లను కట్టడి చేయాలని సౌదీ అరేబియా, ఇరాక్ వంటి దేశాలు పాక్కి హెచ్చరికలు జారీ చేశాయని సమాచారం.