MSDE: అప్రెంటిస్‌షిప్‌పై అవగాహన వర్క్‌షాప్

ABN , First Publish Date - 2023-01-29T19:47:03+05:30 IST

అప్రెంటిస్‌షిప్‌ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు యువత అప్రెంటిస్‌షిప్‌ను స్వీకరించేందుకు నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక

MSDE: అప్రెంటిస్‌షిప్‌పై అవగాహన వర్క్‌షాప్

హైదరాబాద్: అప్రెంటిస్‌షిప్‌ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు యువత అప్రెంటిస్‌షిప్‌ను స్వీకరించేందుకు నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వశాఖ (MSDE) దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 250కిపైగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. వీటి ద్వారా సంస్థలు ఔత్సాహికులు, భాగస్వాముల మధ్య అప్రెంటిస్‌షిప్‌ సంస్కరణలపై అవగాహన కల్పించనున్నారు. రీజనల్‌ డైరెక్టరేట్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్‌ సంబంధిత ప్రాంతాలలో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఎంఎస్‌డీఈ కార్యదర్శి అతుల్ కుమార్ తివారీ మాట్లాడుతూ.. చదువుకుంటూనే పనిచేయడమనేది ఎడ్యుకేషన్‌ టు వర్క్‌ ట్రాన్సిషన్‌లో నిలకడైన విధానమని పేర్కొన్నారు. వర్క్‌షాప్‌ల నిర్వహణ ద్వారా అప్రెంటిస్‌షిప్‌ ప్రయోజనాలను యువత, వ్యాపార సంస్ధలకు వెల్లడిస్తున్నామన్నారు. అప్రెంటిస్‌షిప్‌ చట్టం-1961 సంస్కరణల కారణంగా యువత అత్యుతమ శిక్షణ పొందగలరని అన్నారు.

తెలంగాణకు సంబంధించి తొలి వర్క్‌షాప్‌ను హైదరాబాద్‌లోని జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ‌లో ఈ నెల 24న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఐ. రాణి కుముదిని ప్రారంభించారు. రీజనల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్‌ (RDSE), బోర్డ్‌ ఆఫ్‌ అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ (BOAT), రాష్ట్ర ప్రభుత్వ జిల్లా నైపుణ్యాభివృద్ధి కమిటీ (DSC), జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పోరేషన్‌ (NSDC), విద్యా సంస్థలు, పరిశ్రమ భాగస్వాములు, సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్స్‌ (SSC)లు నుంచి 350 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కుముదిని మాట్లాడుతూ.. ఏ రంగంలో అయినా నైపుణ్యంతో కూడిన కార్మికుల అవసరం ఉంటుందన్నారు. అప్రెంటిస్‌షిప్‌ ఈ అవసరాలను తీరుస్తుందన్నారు. ఈ తరహా వర్క్‌షాప్‌ల ద్వారా యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించడంతో పాటు ప్రస్తుత వ్యాపార వాతావరణంలో డిమాండ్‌ను సైతం తీర్చవచ్చని పేర్కొన్నారు.

Updated Date - 2023-01-29T19:47:06+05:30 IST