నలుగురు యువతులను పెళ్ళాడిన ‘నిత్య పెళ్ళికొడుకు చివరకు ఏమయ్యాడో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-03-23T13:30:42+05:30 IST

విలాసమైన జీవనం సాగించేందుకు నలుగురు యువతులను మోసగించి పెళ్ళి చేసుకున్న ‘నిత్యపెళ్ళికొడుకు’ని తూత్తుకుడి పోలీసులు అరెస్టు చేశారు.

నలుగురు యువతులను పెళ్ళాడిన ‘నిత్య పెళ్ళికొడుకు చివరకు ఏమయ్యాడో తెలిస్తే..

చెన్నై, (ఆంధ్రజ్యోతి): విలాసమైన జీవనం సాగించేందుకు నలుగురు యువతులను మోసగించి పెళ్ళి చేసుకున్న ‘నిత్యపెళ్ళికొడుకు’ని తూత్తుకుడి పోలీసులు అరెస్టు చేశారు. పెళ్ళిళ్ళకు సహకరించిన తండ్రి, చెల్లెలు మూడో భార్య సహా పదిమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరువళ్లూరు జిల్లా తిరుముల్లైవాయల్‌ ప్రాంతానికి చెందిన వినోద్‌ రాజ్‌కుమార్‌(45) విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నేళ్లకు ముందు సెలవుల్లో స్వస్థలానికి వచ్చిన అతడికి తల్లిదండ్రులు వివాహం జరిపించారు. వీరి కాపురం కొద్ది మాసాలపాటు సాగింది. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఆ తర్వాత తల్లిదండ్రులు వినోద్‌ రాజ్‌కుమార్‌కు మరో అమ్మాయితో రెండో వివాహం జరిపించారు. కొద్ది నెలలకే భార్యాభర్తలు విడిపోయారు. ఆ తర్వాత మరో అమ్మాయిని మూడో వివాహం చేసుకున్నాడు. ఆ అమ్మాయి సహకారంతో తనకు మూడు పెళ్ళిళ్లు జరిగిన విషయాన్ని దాచిపెట్టి తూత్తుకుడికి చెందిన ప్యూలా(40) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె నగలు, నగదును ఖర్చుపెట్టాడు. ఆ తర్వాత చెప్పాపెట్టకుండా అతడు తిరుముల్లైవాయల్‌కు తిరిగొచ్చాడు. కొద్ది రోజులైన తర్వాత ప్యూలా తిరుముల్లైవాయల్‌కు వచ్చినప్పుడు వినోద్‌రాజ్‌కుమార్‌ మూడో భార్యతో కాపురం చేస్తుండటం గమనించింది. ఆ తర్వాత ఆమె తూత్తుకుడి మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

Updated Date - 2023-03-23T13:30:42+05:30 IST