Electrocution: అయ్యోదేవుడా.. ఎంతఘోరం జరిగింది.. విద్యుదాఘాతానికి అన్నాతమ్ముడు బలి
ABN , Publish Date - Dec 17 , 2023 | 08:02 AM
తిరువళ్లూర్ జిల్లా చోళవరం సమీపంలో శనివారం ఉదయం వ్యవసాయ భూమిలో కాలకృత్యాలు తీర్చుకొనేందుకు
- బహిర్భూమికి వెళ్లి దుర్మరణం
ప్యారీస్(చెన్నై): తిరువళ్లూర్ జిల్లా చోళవరం సమీపంలో శనివారం ఉదయం వ్యవసాయ భూమిలో కాలకృత్యాలు తీర్చుకొనేందుకు వెళ్లిన అన్నదమ్ములు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన విషాదానికి దారితీసింది. జ్ఞాయిరు పంచాయతీ పరిధిలో ఉన్న కన్నియంపాళయానికి చెందిన మునుస్వామి కుమారులు విశ్వ (12), సూర్య (10) అదే ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 8, 6 తరగతులు చదువుతున్నారు. వారు రోజులాగే శనివారం ఉదయం ఆ గ్రామంలో ఉన్న వ్యవసాయ పొలంలో బహిర్భూమికి ఇంటి నుంచి బయల్దేరారు. దారిలో విద్యుత్ తీగ తెగిపడి ఉన్న దారి గుండా వెళుతూ, వారు విద్యుత్ షాక్కు గురై సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. సుమారు రెండు గంటలైనా వారు ఇంటికి తిరిగి వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు వారి కోసం పలు ప్రాంతాల్లో గాలించారు. అప్పుడు కొంతమంది వారు మరణించినట్లు అందజేసిన సమాచారంతో తల్లిదండ్రులు అక్కడకు వెళ్లి కుమారుల మృతదేహాలు చూసి భోరున విలపించారు. సమాచారం తెలిసి అక్కడకు చేరుకున్న చోళవరం పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చెన్నై స్టాన్లీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.