College: కాలేజీలో విద్యార్థుల ఘర్షణ.. నాటుబాంబులతో దాడి
ABN , First Publish Date - 2023-08-22T08:55:50+05:30 IST
స్థానిక వేళచ్చేరిలో ఉన్న గురునానక్ కళాశాల(Guru Nanak College)లో ఇరువర్గాల విద్యార్థుల మధ్య విబేధాలు తీవ్రస్థాయికి
చెన్నై, (ఆంధ్రజ్యోతి): స్థానిక వేళచ్చేరిలో ఉన్న గురునానక్ కళాశాల(Guru Nanak College)లో ఇరువర్గాల విద్యార్థుల మధ్య విబేధాలు తీవ్రస్థాయికి చేరాయి. కొద్ది రోజులుగా విద్యార్థుల మధ్య వరుస ఘర్షణలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం కళాశాలలో ఉన్నట్టుండి విద్యార్థులు పరస్పరం దాడులకు దిగారు. ఈ కొట్లాట నడుమ ఉన్నట్టుండి గుర్తు తెలియని దుండగులు చొరబడి రెండు నాటుబాంబులను విసిరారు. ఆ బాంబులు పేలడంతో కళాశాల ప్రాంగణంలోని విద్యార్థులు, ప్రత్యేకించి విద్యార్థినులు భయంతో కేకలు పెట్టుకుంటూ నలువైపులా పరుగులు తీశారు. ఈ సంఘటనతో ఆ కళాశాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన కళాశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. నాటు బాంబుల దాడి సంఘటనకు సంబంధించి ఆ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఆ కళాశాల వద్ద పోలీసుల కాపలా కాస్తున్నారు.