Ericsson: ఈసారి ఈ కంపెనీ వంతు.. ఉన్నపళంగా 8500 మంది ఉద్యోగులను తొలగించేశారు..!

ABN , First Publish Date - 2023-02-25T02:21:44+05:30 IST

టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్‌సన్‌ (Telecom Equipment Maker Ericsson) ఖర్చుల తగ్గింపులో భాగంగా 8,500 మంది ఉద్యోగులను (Ericsson to Lay Off 8500 employees) తొలగించనున్నట్లు..

Ericsson: ఈసారి ఈ కంపెనీ వంతు.. ఉన్నపళంగా 8500 మంది ఉద్యోగులను తొలగించేశారు..!

న్యూఢిల్లీ: టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్‌సన్‌ (Telecom Equipment Maker Ericsson) ఖర్చుల తగ్గింపులో భాగంగా 8,500 మంది ఉద్యోగులను (Ericsson to Lay Off 8500 employees) తొలగించనున్నట్లు ప్రకటించింది. దీనిపై ఇప్పటికే ఉద్యోగులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. ఇప్పటికే పలు దేశాల్లో ఉద్యోగులకు లేఆఫ్‌ మెమోలు (Layoff Memos) జారీ చేసినట్లు వెల్లడించింది. ఈ కంపెనీ గత సోమవారమే స్వీడన్‌లో 1,400 మంది ఉద్యోగులను తొలగించింది. రోజుల వ్యవధిలోనే మళ్లీ భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపునకు పూనుకోవడం గమనార్హం.

జర్మనీకి చెందిన రసాయనాల కంపెనీ బీఏఎస్‌ఎఫ్‌ 2,600 మంది ఉద్యోగులకు లేఆఫ్‌ ప్రకటించింది. రష్యాలో తమ భాగస్వామ్య కంపెనీ నష్టాల పాలవడం, ఖర్చులు పెరగడం వల్లే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు బీఏఎ్‌సఎఫ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్‌ఏపీ ల్యాబ్స్‌ కూడా భారత్‌లో 300 మంది ఉద్యోగులకు లేఆఫ్‌ ప్రకటించింది. ఇదిలా ఉండగా, ఇప్పటికే 11వేల మంది ఉద్యోగులను తొలగించిన ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా మళ్లీ కొంతమంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. మెటా సహా దిగ్గజ ఐటీ కంపెనీలు లేఆఫ్‌లను ప్రకటిస్తుండడంతో.. టెకీలు గజగజ వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ వార్త వినాల్సివస్తోందనని ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది 1,044 ఐటీ కంపెనీలు 1,59,846 మంది ఉద్యోగులను తొలగించగా.. ఈ ఏడాది తొలి 40 రోజుల్లో ఆ సంఖ్య 1,01,807గా నమోదైంది. లేఆఫ్స్‌ డాట్‌ ఎఫ్‌వైఐ వెబ్‌సైట్‌ ఈ గణాంకాలను విడుదల చేసింది. మరికొన్ని కంపెనీలు కూడా లేఆఫ్స్‌ బాటలో వెళ్లనున్నట్లు ప్రకటించాయని ఆ వెబ్‌సైట్‌ స్పష్టం చేసింది. అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలే ఇందుకు కారణమని ఐటీ నిపుణులు, ఆర్థికవేత్తలు చెబుతున్నారు.

Updated Date - 2023-02-27T14:40:53+05:30 IST