Stock Market: స్టాక్ మార్కెట్పై ఎన్నికల ఫలితాల ప్రభావం.. రికార్డ్ స్థాయికి చేరిన సెన్సెక్స్, నిఫ్టీ
ABN , First Publish Date - 2023-12-04T17:30:49+05:30 IST
హిందీ గడ్డపై జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నమోదు చేసిన అఖండ విజయాలు.. స్టాక్ మార్కెట్పై సానుకూల ప్రభావం చూపాయి. సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ప్రారంభమై..
Election Effect On Stock Market: హిందీ గడ్డపై జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నమోదు చేసిన అఖండ విజయాలు.. స్టాక్ మార్కెట్పై సానుకూల ప్రభావం చూపాయి. సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ప్రారంభమై.. రికార్డ్ స్థాయిలో ముగిశాయి. ఉదయం 9:22 గంటల సమయంలో 825 పాయింట్ల లాభంతో 68,306 దగ్గర ట్రేడ్ అయిన సెన్సెక్స్.. 1,383.93 పాయింట్లు ఎగిసి 68,865.12 వద్ద ఆల్ టైమ్ స్థాయి వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 418.90 పాయింట్లు జంప్ చేసి.. రికార్డు స్థాయిలో 20,686.80 వద్ద ముగిసింది. ఎనర్జీ స్టాక్స్ 3%, ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.6% పెరిగి.. ఆయా రంగాలకు లాభాలు తెచ్చిపెడ్డాయి. స్మాల్, మిడ్-క్యాప్లు కూడా ఒక్కొక్కటిగా 1% లాభపడినట్టు తేలింది.
సెన్సెక్స్ 30 సూచీలో అన్ని షేర్లు లాభాల్లో ఉండడం గమనార్హం. ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్అండ్టీ, ఎంఅండ్ఎం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, పవర్గ్రిడ్, హెచ్యూఎల్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు మంచి లాబాలతో ట్రేడ్ అయ్యాయి. బలమైన త్రైమాసిక వృద్ధి, నెలవారీ ఫ్యాక్టరీ కార్యకలాపాల డేటా నేపథ్యంలో.. నిఫ్టీ శుక్రవారం రికార్డు స్థాయికి చేరుకుంది. అటు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరపతి విధాన కమిటీ నిర్ణయాలు ఈనెల 8న వెలువడతాయి. వడ్డీ రేట్లలో ఆర్బీఐ ఎలాంటి మార్పు చేయకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. ద్రవ్య నిర్వహణ, రుణాల వృద్ధి, ద్రవ్యోల్బణంపై ఆర్బీఐ గవర్నర్ చేసే వ్యాఖ్యలు కీలకం అవ్వొచ్చు.