హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు పచ్చి అబద్దం

ABN , First Publish Date - 2023-01-30T02:20:10+05:30 IST

హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థ ఆరోపణలపై అదానీ గ్రూప్‌ మరోసారి విరుచుకుపడింది. ఆ నివేదిక పచ్చి అబద్దాల పుట్ట అని కొట్టివేసింది...

హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు పచ్చి అబద్దం

భారత్‌ను దెబ్బతీసే ఉద్దేశపూర్వక దాడి : అదానీ గ్రూప్‌

న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థ ఆరోపణలపై అదానీ గ్రూప్‌ మరోసారి విరుచుకుపడింది. ఆ నివేదిక పచ్చి అబద్దాల పుట్ట అని కొట్టివేసింది. ఈ ఆరోపణలను కేవలం తమ కంపెనీపై మాత్రమే చేసిన దాడిగా చూడకూడదని, దేశీయ సంస్థల స్వాతంత్య్రం, సమగ్రత, విశ్వసనీయత, దేశ అభివృద్ధి, ఆశలపై జరిగిన దురుద్దేశపూర్వక దాడిగా చూడాలని కోరింది. దీనికి సంబంధించి ఆదివారం 413 పేజీలతో కూడిన ఒక ప్రకటన విడుదల చేసింది. తప్పుడు ఆరోపణలతో తమ గ్రూప్‌ కంపెనీల షేర్ల ధరలు పడగొట్టి.. హిండెన్‌బర్గ్‌ షార్ట్‌ సెల్లింగ్‌ ద్వారా భారీగా లాభపడాలని చూస్తోందని విమర్శించింది.

అదానీ గ్రూప్ విడుదల చేసిన 413 పేజీల నివేదిక లింక్

ముమ్మాటికీ కుట్రే

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.20,000 కోట్ల ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఎఫ్‌పీఓ) సమయంలో హిండెన్‌బర్గ్‌ ఈ నివేదిక విడుదల చేయడం ముమ్మాటికీ పెద్ద కుట్ర అని అదానీ గ్రూప్‌ తన ప్రకటనలో పేర్కొంది. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థ విశ్వసనీయత, నైతిక విలువలనీ ప్రశ్నించింది. ‘ఈ నివేదిక స్వతంత్రమూ కాదు, నిష్పాక్షికమూ కాదు, సరైన పరిశోధనా కాదు’ అని కొట్టివేసింది. హిండెన్‌బర్గ్‌ లేవనెత్తిన 88 ప్రశ్నల్లో 65 ప్రశ్నలకు అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు ఎప్పుడో సమాధానం ఇచ్చాయని తెలిపింది. మిగతా 23 ప్రశ్నల్లో 18 పబ్లిక్‌ షేర్‌హోల్డర్లు, థర్డ్‌ పార్టీలకు సంబంధించినవని పేర్కొంది. మిగతా ఐదు ప్రశ్నలూ నిరాధారమైనవని తెలిపింది. తమ కంపెనీలన్నీ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగానే పనిచేస్తున్నట్టు మరోసారి స్పష్టం చేసింది.

ఎఫ్‌పీఓకు ఢోకా లేదు

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.20,000 కోట్ల ఎఫ్‌పీఓకు ఢోకా లేదని అదానీ గ్రూప్‌ విశ్వాసం వ్యక్తం చేసింది. గ్రూప్‌ సీఎఫ్‌ఓ జుగేశ్‌ ఇందర్‌ సింగ్‌ ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎఫ్‌పీఓ ధర, సబ్‌స్ర్కిప్షన్‌ తేదీల్లోనూ ఎలాంటి మార్పు ఉండదని మరోసారి స్పష్టం చేశారు.

అదానీ ఎఫ్‌పీఓలో ఎల్‌ఐసీ పెట్టుబడి

అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లపై ప్రభుత్వ రంగంలో భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ఆసక్తి కొనసాగుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అదానీ గ్రూప్‌ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.20,000 కోట్ల ఎఫ్‌పీఓలోనూ ఎల్‌ఐసీ.. యాంకర్‌ ఇన్వెస్టర్ల కోటాలో పెద్ద మొత్తంలోనే పెట్టుబడి పెట్టింది. బుధవారం ముగిసిన యాంకర్‌ ఇన్వెస్టర్స్‌ కోటాలో రూ.300 కోట్లతో 9,15,748 షేర్లు కొనుగోలు చేసింది. ఇది మొత్తం యాంకర్‌ ఇన్వెస్టర్స్‌ కోటాలో 5 శాతానికి సమానం. ఈ యాంకర్‌ ఇన్వెస్టర్ల కోటా.. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదిక విడుదలైన బుధవారమే ముగిసింది.

ఇంకా లాభాల్లోనే

హిండెన్‌బర్గ్‌ నివేదికతో బుధ, శుక్రవారాల్లో అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు భారీగానే నష్టపోయాయి. దీంతో ఈ గ్రూప్‌ కంపెనీల్లో ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ రెండు రోజుల్లోనే రూ.72,200 కోట్ల నుంచి రూ.55,700 కోట్లకు పడిపోయింది. అయినా రూ.28,400 కోట్ల అసలు పెట్టుబడులతో పోలిస్తే ఈ గ్రూప్‌ కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టిన ఎల్‌ఐసీ ఇంకా రూ.27,300 కోట్ల లాభాల్లో ఉంది.

Updated Date - 2023-01-30T09:10:12+05:30 IST