పట్టపగలు దారి దోపిడీ

ABN , First Publish Date - 2023-02-06T00:37:31+05:30 IST

పట్టపగలు దారి దోపిడీ జరిగింది. ఇద్దరు యువకులు వృద్ధ దంపతులపై దాడి చేసి పది లక్షల విలువైన బంగారు చైన్లను తెంపుకుని పోయారు.

పట్టపగలు దారి దోపిడీ

వృద్ధ దంపతులపై దాడి.. బంగారం అపహరణ

దెందులూరు, ఫిబ్రవరి 5 : పట్టపగలు దారి దోపిడీ జరిగింది. ఇద్దరు యువకులు వృద్ధ దంపతులపై దాడి చేసి పది లక్షల విలువైన బంగారు చైన్లను తెంపుకుని పోయారు. ఈ ఘటన దెందులూరు మండలం జోగన్న పాలెంలో కలకలం రేపింది. వివరాలివి.. జోగన్నపాలెంలో నివాసముంటున్న వృద్ధ దంపతులు ఆలూరు రాణీ, రంగారావు బంధువుల ఇంటిలో జరిగే శుభ కార్యానికి వెళ్లి మోటార్‌ సైకిల్‌పై తిరిగి వస్తూ మార్గ మధ్యలో ఆగారు. ఇంతలో వెనుక నుంచి గుర్తు తెలియని ఇద్దరు యువకులు మోటారు సైకిల్‌పై వచ్చి వృద్ధ జంటపై దాడి చేసి, రాణి మెడలో వున్న పది లక్షల విలువైన మూడు బంగారు చైన్లను తెంపుకుని పారిపోయారు. బాధితులు ఇద్దరూ సమీపంలో వున్న జడ్పీటీసీ సభ్యుడు నిట్టా లీలానవకాంతం, వైసీపీ నేత గంగారాజు ఇంటికి వెళ్లి విషయం తెలిపారు. వారు తమ కారులో నిందితుల కోసం గాలించే సరికి వారు తప్పించుకుని పారిపోయారు. వృద్ధ దంపతులను తీసుకువెళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు.

Updated Date - 2023-02-06T00:37:34+05:30 IST