Share News

Yanamala : రాష్ట్ర ఆర్థికస్థితి వివరాలు ఎందుకివ్వరు..?

ABN , First Publish Date - 2023-10-29T07:03:40+05:30 IST

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరాలు ఇవ్వాలని తాను లేఖ రాస్తే, రెండు నెలలైనా ఆర్థిక శాఖ కార్యదర్శి నుంచి ప్రత్యుత్తరం లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆక్షేపించారు.

Yanamala : రాష్ట్ర ఆర్థికస్థితి వివరాలు ఎందుకివ్వరు..?

  • రెండు నెలలైనా ఆర్థిక శాఖ

  • కార్యదర్శి నుంచి స్పందన లేదు

  • ఆడిట్‌కు లెక్కలు సమర్పించని

  • ప్రభుత్వ రంగ సంస్థలు

  • అప్పుల వివరాలు దాచిపెట్టడానికే

  • లెక్కలు సమర్పించట్లేదు

  • ఆర్థిక మంత్రి బుగ్గనకు

  • యనమల రామకృష్ణుడు లేఖ

  • అప్పులు, బకాయిల వివరాలు

  • బయట పెట్టాలని డిమాండ్‌

అమరావతి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరాలు ఇవ్వాలని తాను లేఖ రాస్తే, రెండు నెలలైనా ఆర్థిక శాఖ కార్యదర్శి నుంచి ప్రత్యుత్తరం లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆక్షేపించారు. తాను అడిగిన వివరాలపై సమాధానం ఇవ్వకుండా నిర్లిప్తంగా ఉండటం సరికాదన్నారు. వాటిని ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డికి శనివారం ఆయన ఒక లేఖ రాశారు. ‘2021-22కు సంబంధించి కాగ్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రూ.3.25 లక్షల కోట్లు అప్పులు చేశారు. అప్పు... స్థూల ఉత్పత్తి నిష్పత్తి 40-45 శాతం ఉందని చూసి ఆశ్చర్యపోయాను. టీడీపీ హయాంలో రూ.1.39 లక్షల కోట్ల అప్పు చేస్తే, అసెంబ్లీ సాక్షిగా మీరు ఏ స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారో నాకు ఇంకా గుర్తుంది. మీ హయాంలో మూడేళ్లలోనే మేం చేసిన దానితో పోలిస్తే రెండున్నర రెట్లు ఎక్కువ అప్పు చేశారు. అప్పు లెక్కలు కూడా కాగ్‌ మార్చుకోవాల్సి వచ్చింది.

తప్పుడు గణాంకాలు ఇవ్వడం వల్లే ఇలా మార్పు జరిగింది. 2021-22 ఆడిట్‌ తర్వాత మరింత భారీగా అప్పులుచేశారు. 97 ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే అందులో 30 మాత్రమే ఆడిట్‌కు లెక్కలు సమర్పించాయని కాగ్‌ ఎత్తిచూపింది. చేసిన అప్పులు దాచిపెట్టడానికే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల లెక్కలు ఇవ్వడంలేదు. వచ్చే ఏడాది నుంచి ఏటా రూ.50వేల కోట్లకు మించిన చెల్లింపులను అప్పుల కింద చెల్లించాల్సి ఉంటుందని కూడా కాగ్‌ తెలిపింది. ఈ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. అందుకే కాగ్‌ ఎత్తిచూపిన లెక్కలను నిర్ధారించాలని ఆర్థికశాఖ కార్యదర్శికి లేఖ రాశాను. ఆయన మౌనం మా అనుమానాలను మరింత బలపరుస్తోంది’ అని యనమల తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకోవడం రాష్ట్ర ప్రజల హక్కని, అందుకే కొన్ని వివరాలు ఇవ్వాలని కోరుతున్నామని తెలిపారు. మేం కోరిన వివరాలను ప్రజాక్షేత్రంలో ఉంచగలిగితే ఈ ప్రభుత్వ పాలనను ప్రజలు బేరీజు వేసుకొనే అవకాశం ఉంటుందని యనమల తన లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2023-10-29T07:03:40+05:30 IST