Share News

వైసీపీ మైండ్‌ గేమ్‌

ABN , Publish Date - Dec 26 , 2023 | 12:19 AM

అధికార పార్టీకి ఓటమి భయం పట్టుకుంది. నమ్ముకున్న వర్గాలు ఒక్కొక్కటిగా చేజారుతున్నాయి. ఓటు బ్యాంకు గణనీయంగా తగ్గుతోంది.

 వైసీపీ మైండ్‌ గేమ్‌

టార్గెట్‌ టీడీపీగా లోపాయికారి ఒప్పందాలు

నాయకుల క్యారెక్టర్లపై ప్రతికూల ప్రచారాలు

టీడీపీ–జనసేన మధ్య బేధాభిప్రాయాలే అంతిమ లక్ష్యం

అధికార పార్టీకి ఓటమి భయం పట్టుకుంది. నమ్ముకున్న వర్గాలు ఒక్కొక్కటిగా చేజారుతున్నాయి. ఓటు బ్యాంకు గణనీయంగా తగ్గుతోంది. గెలుపు అసాధ్యమనుకున్నారో ఏమో గానీ ఆపరేషన్‌ టీడీపీగా మైండ్‌గేమ్‌కు ఆ పార్టీ నాయకులు తెరతీశారు. జిల్లాలోని ఒక్కో నియోజకవర్గంలో ఒక్కోలా మైండ్‌గేమ్‌ ఆడిస్తున్నారు. సీట్ల కేటాయింపు పేరిట టీడీపీ–జనసేన కూటమి మధ్యన చిచ్చు రేపే యత్నాలు సాగుతున్నాయి. నోటి స్పీడు పేరుతో చింతమ నేని ప్రభాకర్‌పై అభియోగాలు మోపుతున్నారు. నియోజక వర్గాల్లో అభ్యర్థులను మార్చేస్తారనే మౌత్‌ పబ్లిసిటీకి శ్రీకారం చుట్టారు. ఒక్కో నియోజక వర్గాన్ని టార్గెట్‌ చేస్తూ ఎన్నికల నాటికి ఓటర్లలో గందరగోళ వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా జిల్లాలో వేగంగా అడుగులు పడుతున్నాయి.

– ఏలూరు–ఆంధ్రజ్యోతి

చింతమనేని స్పీడును అడ్డుకునేలా..

రాబోయే ఎన్నికల్లో దెందులూరులో ఎలాగైనా గెలవాలన్న ఆకాంక్షతో టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చింతమనేనిని వైసీపీ టార్గెట్‌ చేసింది. ఆయన స్పీడును ఇప్పుడు వైసీపీ నాయకులు టార్గెట్‌ చేశారు. ఎక్కడ ఏ చిన్న వివాదం రేగినా చింతమనేనిని బాధ్యుడిని చేస్తూ నిరసనలు, ధర్నాలు చేయడం అధికార పార్టీకి ఈ మధ్యన పరిపాటిగా మారింది. ఈ ధర్నాలతో లాభం పొందక పోగా బూమ్‌రాంగ్‌ అవుతోందని భావించిన ఆ పార్టీ నాయకులు ఇప్పుడు చింతమనేని నోటి స్పీడును టార్గెట్‌ చేశారు. ఎవరినీ లెక్క చేయరని, అందరిపై నోరు పారేసుకుంటున్నారనే విమ ర్శలను గుప్పిస్తూ మౌత్‌ పబ్లిసిటీని స్థానికంగా వైరల్‌ చేస్తున్నారు. ఇటీవల టీడీపీలో చింతమనేనికి, ఆ పార్టీ నాయకులకు మధ్యన గ్యాప్‌ తెచ్చే ప్రయత్నా లకు వైసీపీ ఆద్యం పోసింది. ఒకరిపై మరొకరికి చెడు అభిప్రాయాలను సృష్టిస్తూ లాభపడే ప్రయత్నాలు చేసింది. దాదాపు సక్సెస్‌ అయ్యే పరిస్థితి కనిపించిన తరుణంలో టీడీపీ నాయకులు వైసీపీ పన్నాగాన్ని పసిగట్టారు. తామందరం చింతమనేనితోనే ఉంటామని చెబుతూ వైసీపీ ప్రచారాలకు చెక్‌ పెట్టారు. అదే విషయాన్ని ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ స్పష్టం చేశారు. దీంతో దెందులూరులో వైసీపీ ప్రయోగాలు మరోసారి బెడిసి కొట్టినట్టయింది.

టార్గెట్‌ కూటమి

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కాక ముందే వైసీపీ ప్రజాప్రతినిధులకు ఓటమి భయం వెన్నాడుతోంది. నియోజకవర్గాల్లో పరువు దక్కించుకునే ప్రత్యామ్నాయ పరిస్థితులకు దారులు వెతుక్కుంటున్నారు. చివరకు ఆపరేషన్‌ టీడీపీని తెరపైకి తెచ్చారు. వైసీపీ ఓటమికి ప్రధాన హేతువైన టీడీపీ–జనసేన కూటమిపైనే తొలి అస్ర్తాన్ని సంధిస్తున్నారు. ఇరు పార్టీల నాయకుల మధ్య చిచ్చు రేపుతూ ఎవరికి సీటు దక్కితే వారే కింగ్‌ అవుతారనే బేధాభిప్రాయాలు తీసుకొచ్చేలా ప్రచారాలు సాగిస్తున్నారు. జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో కూటమి నాయకులను రెచ్చగొడుతున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అభ్యర్థుల ఎంపికపై చాలా స్పష్టంగా ఉన్నారు. రాబోయే పదేళ్లు టీడీపీ–జనసేన సహకారం కొనసాగాలని తన పార్టీ నాయకులు, కార్యకర్తలకు చెబుతూ వెళ్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ సైతం పొత్తులపై వరుస పరిణామాలను సమీకరిస్తోంది. ఈలోపే ఫలానా నియోజకవర్గానికి ఆ ఫలానా అభ్యర్థే కరెక్ట్‌ అంటూ స్థానికంగా జనసేన నాయకులను వైసీపీ రెచ్చగొట్టే ప్రయత్నాలకు తెరతీస్తోంది. ఆ ట్రాప్‌లో భాగంగా ఏలూరు, దెందులూరు, చింతలపూడి,

పోలవరం నియోజక వర్గాలే లక్ష్యంగా మౌత్‌ పబ్లిసిటీని విస్తరిస్తోంది.

బలం వున్నచోట్లే సీట్లు

2014లో బీజేపీ, జనసేన పొత్తుతో తెలుగుదేశం ఎన్నికలు వెళ్లింది. జనసేన ఎన్నికల్లో పోటీ చేయకపోయినా మద్దతు ప్రకటించింది. పొత్తు ఉంది కదాని సగం సగం సీట్లు పొత్తు పార్టీకి ఇవ్వలేదు. బీజేపీకి బలం వున్నచోట్ల మాత్రమే టీడీపీ సీట్లు కేటాయించింది. ప్రతిపాదనలు, సవరణల తర్వాతే తుది నిర్ణయాలను అధినేతలు ప్రత్యక్షంగా ప్రకటిస్తారు. ఈ నేప థ్యంలో దశాబ్దాల తరబడి అనుభవం ఉన్న టీడీపీ, జనసేన అధినేతలు ఆచితూచి తీసుకునే నిర్ణయాలను కాదని, స్థానికం గా నాయకులను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే జరిగితే ఎదురయ్యే నష్టాన్ని క్యాష్‌ చేసుకోవడమే లక్ష్యంగా వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు.

Updated Date - Dec 26 , 2023 | 12:19 AM