యనమదుర్రు అంతేనా..!
ABN , First Publish Date - 2023-06-13T00:03:26+05:30 IST
యనమదుర్రు ఒకప్పటి జలవనరుల కాల్వ.. తరువాత మురికి కాల్వగా మారిపోయింది.. జిల్లాలో ఇది మేజర్ డ్రెయిన్.. దాదాపు 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు చెందిన మురుగునీరు ఉప్పుటేరులో కలుస్తుంది.
15 ఏళ్ల కిందట రూ. 108 కోట్లతో ఆధునికీకరణ పనులు
గత ప్రభుత్వం మంజూరు చేసిన రూ.100 కోట్ల ప్రాజెక్టు పెండింగ్..
భీమవరం పురపాలక చెత్తతో పూడుకుపోతున్న డ్రెయిన్
భీమవరం, మే 27 : యనమదుర్రు ఒకప్పటి జలవనరుల కాల్వ.. తరువాత మురికి కాల్వగా మారిపోయింది.. జిల్లాలో ఇది మేజర్ డ్రెయిన్.. దాదాపు 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు చెందిన మురుగునీరు ఉప్పుటేరులో కలుస్తుంది. తాడేపల్లిగూడెం సరిహద్దు నందమూరు అక్విడెక్టు నుంచి 50 కిలోమీటర్లుపైగా ప్రవహించి మొగల్తూరు మండలం సముద్రతీరం ఉప్పుటేరు వద్ద కలుస్తుంది. అనేక మీడియం, మైనర్ డ్రెయిన్లు దీనిలో కలుస్తాయి. దాదాపు 1200 క్యూసెక్కుల నీరు రోజూ ప్రవహిస్తుంది. వరద సమయంలో రెండు వేల క్యూసెక్కుల వరకు నీరు ప్రవహిస్తుంది. ఇంతటి కీలకమైన ఈ డ్రెయిన్ అనేక కారణాలతో గట్ల వెంబడి చెత్త వేయడం, గట్లు బలహీనపడుతూ ఎవరికి పట్టని మురికి కాల్వగా తయారైంది.
15 ఏళ్ల కిందట ఆధునికీకరణ పనులు.. కొన్ని పనులు పెండింగ్..
యనమదుర్రు డ్రెయిన్ 2007లో డెల్టా ఆధునికీకరణ పనుల్లో భాగంగా రూ. 108 కోట్లతో టెండర్లు పిలిచి ఐదు చోట్ల వంతెన లు, గట్ల పటిష్ఠత, దిగువ ప్రాంతంలో డ్రెడ్జింగ్ పనులు చేపట్టారు. 70 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలి నవి పెండింగ్లో ఉండిపోయాయి.
మూడు వంతెనలకు అప్రోచ్ పనుల పెండింగ్
డెల్టా ఆధునికీకరణ పనుల్లో భాగంగా భీమవరం నియోజకవర్గంలో మూడు వంతెనలను 2010–11 ప్రాంతంలో నిర్మించారు. ఒకటి భీమవరం పట్టణం, రెండోది గొల్లవానితిప్ప, మూడోది తోకతిప్ప వద్ద వీటిని నిర్మించారు. వీటి అప్రోచ్ రోడ్ల కోసం అప్పటి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మూడు కోట్లు రూపాయల చొప్పున 9 కోట్లతో అప్రోచ్ నిర్మాణాలకు పంపించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్కొక్క దాన్ని రూ.9 కోట్లు చొప్పున పెంచి రూ.27 కోట్లతో మరోసారి ప్రతిపాదనలు పంపారు. నిధుల కొరత కారణంగా పనులు ముందుకు సాగలేదు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గత ఏడాది చివరిలో మరోసారి ఒక్కో దానికి రూ. 12 కోట్లు చొప్పున రూ. 36.70 కోట్లతో మళ్లీ ప్రతిపాద నలు పంపించారు. ఆర్అండ్బీ ఈఈ లోకేశ్వరరావు మాట్లాడుతూ నిధుల కేటాయింపు జరిగిందని, టెండర్లు పిలవాల్సి ఉందని తెలిపారు.
రూ.100 కోట్ల ప్రాజెక్టు పెండింగ్..
యనమదుర్రు డ్రెయిన్ కాలుష్య కాసారంగా మారుతోంది. ఎగువన 20పైగా పరిశ్రమలు ఉండడంతో ముఖ్యంగా గోస్తనీ డ్రెయిన్ ద్వారా పరిశ్రమల కాలుష్యం వల్ల ఈ డ్రెయిన్ ప్రమాదంగా మారింది. నందమూరి అక్విడెక్టుపైన దీన్నే ఎర్రకాలువగా పిలుస్తారు. అక్కడి వరకు మంచినీరు వచ్చినప్పటికీ దిగువన కాలుష్యంగా మారుతుంది. దీని నివారణకు 2016లో అప్పటి మంత్రి పితాని సత్యనారాయణ, పారిశ్రామికవేత్తలు, అధికారులతో భీమవరంలో సమావేశం పెట్టి రూ.100 కోట్లతో కాలుష్య నివారణ ప్రణాళికను నిర్ణయిం చారు. తణుకు ప్రాంతం నుంచి పైప్లైన్ ద్వారా కాలుష్య వ్యర్థాలను తీర ప్రాంతం లోసరి ఏరియాలో ఒక ట్రీటెమెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసి శుద్ధిచేసి ఆ నీరు సముద్రంలో కలిసేవిధంగా ప్రణాళిక ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మారిన అనంతరం మంజూరైన రూ.100 కోట్లు నిధులు ఆపివేశారు.
అభివృద్ధి ఊసే లేదు..
ఈ డ్రెయిన్ కొన్నేళ్లుగా క్రమంగా పూడిపోవడం, గట్లు బలహీన పడడం వంటివి పునరావృతమైనవి. కొన్ని చోట్ల జగనన్న కాలనీల కోసం మట్టిని తవ్విన ఘటనలు ఉన్నాయి. ఇటీవల కాలంలో డ్రెయిన్ అభివృద్ధికి జలవనరులశాఖ ఎటువంటి నిధులను కేటాయించడం లేదు. ఈ డ్రెయిన్ వల్ల భీమవరానికి ప్రతీ ఏటా ముంపు సమస్య తలెత్తుతోంది. 14 చోట్ల వీటికి అవుట్లెట్లు ఉండడంతో ఆగస్టు నెలలో వచ్చే వరద నీరు ఎగదన్ని సుమారు 15 వార్డులలో నీరు నిలిచి పోయి ముంపు సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ఈడ్రెయిన్ అభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.