ఏటేటా కష్టాల ‘వంతు’
ABN , First Publish Date - 2023-03-05T00:06:03+05:30 IST
దాళ్వా వరిసాగు కీలకదశలో రైతులకు ఏటేటా కష్టాలు తప్పడం లేదు. వంతులవారీ విధానమొచ్చినా పూర్తిస్థాయిలో నీరు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వంతులవారీ ఇస్తున్నా అందని నీరు
ఎండుతున్న వరిచేలు.. ఇంజన్లతో తడులు
రొయ్యల చెరువులు నింపుకుంటున్నారు
పట్టించుకోని అధికారులు : రైతుల వేదన
ఆకివీడు, మార్చి 4: దాళ్వా వరిసాగు కీలకదశలో రైతులకు ఏటేటా కష్టాలు తప్పడం లేదు. వంతులవారీ విధానమొచ్చినా పూర్తిస్థాయిలో నీరు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆకివీడు పరిసర ప్రాంతాల్లో వరిచేలు దుబ్బులు చేసి పొట్ట దశలో ఉన్నాయి. ఎరువులు చల్లే ప్రక్రియ పూర్తికావడంతో సాగునీటి అవసరం ఉంటుంది. ఈ తరుణంలో అధికారులు ప్రకటించిన వంతు ప్రకారం సాగునీరు సరఫరా అవడం లేదు. పంట, మురుగు కాల్వలో ఆధునీకరించకపోవడంతో కిక్కిస, తూడు, గుర్రపుడెక్క పేరుకుపోయి నీటి సరఫరాకు అవరోధంగా మారుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో ఆక్వా చెరువులకు భారీ మోటార్లతో నీటిని మళ్లిస్తుండడంతో దిగువున ఇంజ న్లతో తోడుకుందామన్నా పూర్తిస్థాయిలో నీరు అందని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాళ్వా సాగు ముందుగా ప్రారంభించాలంటూ అధికారులు తొందరపెట్టారు.ఇప్పుడు సాగునీరు అందక నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే ఎకరానికి రూ.25 వేలు పైనే పెట్టుబడులు పెట్టామని, ఇంజన్లతో నీటిని తోడుకోవడంతో అదనంగా మరో రూ.4 వేలు దాకా అవుతుందని ఆగ్రహిస్తున్నారు. రొయ్యల చెరువు నీటిని పంటకాల్వలోకి పంపించమని ఆ నీటినే పొలాల్లోకి పెట్టుకుంటుండడంతో వ్యవసాయం చౌడుబారి దిగుమతులు తగ్గుతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. శివారు పొలాలకు కాకుండా రోడ్డుపక్కనే ఉన్న పొలాలకు కూడా సాగునీరు అందడం లేదు. సంబంధిత అధికారులు ఇన్చార్జిలుగా విధులు నిర్వహిస్తుండడంతో పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. సాగునీటి సమస్య పరిష్కరించకపోతే ఆందోళనకు దిగుతామని రావూరి నాగేశ్వరరావు, వెలివల శివ, కడియం పెదకాపు పలువురు రైతులు హెచ్చరిస్తున్నారు. సాగునీరు అందక ఎండుతున్న వరి పొలాలను వ్యవసాయాధికారులు శనివారం పరిశీలించారు.