విద్యార్థిని మింగిన అలలు
ABN , Publish Date - Dec 18 , 2023 | 12:35 AM
సముద్ర స్నానానికి వెళ్లిన నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థి రాకాసి అలల ధాటికి దుర్మరణం పాలైన ఘటనతో నూజివీడు ట్రిపుల్ ఐటీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
నూజివీడు ట్రిపుల్ ఐటీలో విషాద ఛాయలు
నూజివీడు టౌన్, డిసెంబరు 17: సముద్ర స్నానానికి వెళ్లిన నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థి రాకాసి అలల ధాటికి దుర్మరణం పాలైన ఘటనతో నూజివీడు ట్రిపుల్ ఐటీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన ఏడుగురు విద్యార్థులు ఆదివారం ఆటవిడుపుగా మచిలీపట్నం బీచ్కు వెళ్ళారు. సముద్రస్నానం చేస్తుండగా అలల తాకిడికి ఈసీఈ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి అఖిల్ సముద్రంలో గల్లంతయ్యాడు. ఇతనితో పాటు ఇతర విద్యార్థులు సముద్రంలోకి కొట్టుపోవ డాన్ని గమనించిన మెరైన్ పోలీసులు వారిని కాపాడారు. గల్లంతైన అఖిల్ మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. దీంతో నూజివీడు ట్రిపుల్ఐటీలో తీవ్రవిషాదఛాయలు అలుముకున్నాయి.
పలు కారణాలు చెప్పి అనుమతులు తీసుకుని...
ఆదివారం సెలవుదినం కావడంతో శనివారం వివిధ కారణాలను చూపుతూ నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు బయటకు వెళ్ళేందుకు అనుమతులు తీసుకున్నారు. ఇందులో ము గ్గురు సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు ఉండగా, నలుగురు ఈసీ ఈ చదువుతున్నారు. అయితే బీచ్కు వెళ్ళేందుకు అంటే అనుమతులు ఇవ్వరని ముందస్తుగా పలు కారణాలు చూపుతూ ఔటింగ్ తీసుకోవాలని నిర్ణయించిన విద్యార్థులు శనివారం బయటకు వెళ్ళగా ప్రమాదంలో నెల్లూరు జిల్లా కందుకూరు మండలం మోపాడ గ్రామానికి చెందిన టి.కృష్ణారావు కుమారుడు తోకల అఖిల్ (21) మృతి చెందటంతో ఆర్జీయూకేటీ నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ రిజిస్ట్రార్ గోపాలరాజు, చీఫ్ అడ్మినిస్ర్టేటివ్ ఆఫీసర్ పవన్, శ్రీకాకుళం క్యాంపస్ ఇన్చార్జ్ రియాజ్ హుస్సేన్, డీన్ ఆఫ్ స్టూడెంట్స్ వెల్ఫేర్ వెంకట్రావు, నూజివీడు ట్రిపుల్ ఐటీ పీఆర్వో సురేష్బాబు సంఘటనా స్థలానికి చేరుకు న్నారు. ప్రమాద సంఘటనకు సంబంధించిన వివరాలను తండ్రి కృష్ణారావుకు వారు అందించారు. మచిలీపట్నం జిల్లా ఆసుపత్రిలో అఖిల్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అందించారు.