జాతీయ స్థాయికి తాటిచెట్ల తోట
ABN , First Publish Date - 2023-12-03T00:38:31+05:30 IST
తాటిచెట్టుతో గ్రామీణ ప్రాంతాలకు విడదీయ లేనంత అనుబంధం. పల్లెల్లో ఎక్కడబడితే అక్కడ అక్కడ కనిపించే తాటిచెట్టు ప్రస్తుత కాంక్రీట్ జంగిల్లో ఉనికి కోల్పోతోంది.
సైన్స్ కాంగ్రెస్లో కైకరం విద్యార్థుల అద్భుత ప్రదర్శన
అభినందించిన కలెక్టర్, ఉన్నతాధికారులు
ఉంగుటూరు, డిసెంబరు 2: తాటిచెట్టుతో గ్రామీణ ప్రాంతాలకు విడదీయ లేనంత అనుబంధం. పల్లెల్లో ఎక్కడబడితే అక్కడ అక్కడ కనిపించే తాటిచెట్టు ప్రస్తుత కాంక్రీట్ జంగిల్లో ఉనికి కోల్పోతోంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్న యువత తాటిచెట్టును మరిచిపోతున్నారని చెప్పవచ్చు. ఈ దశలో పది, ఎనిమిదో తరగతి విద్యార్థులు తాడిచెట్టును జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. గ్రామీణ ప్రాంతాల్లో అతి సాధారణంగా కనిపించే తాటిచెట్టు ప్రస్తుతం అంతరించేపోయే దశలో ఉందని గుర్తించి సైన్స్ కాంగ్రెస్లో దానినే తమ ప్రదర్శనాంశంగా ఎంచుకున్నారు. సైన్స్ ఉపాధ్యాయులతో కలసి తాటి చెట్ల తోట – నూతన వ్యవసాయం విధానం అంటూ చెట్ల పెంపకం, ఉత్పత్తుల తో ఆదాయ మార్గాలన్నింటిని వివరిస్తూ విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్లో ప్రదర్శనకు ఉంచారు. ఈ ప్రదర్శనలో ప్రముఖులతో పాటు తోటి విద్యార్థులను సైతం తాటిచెట్ల తోట అంశం విశేషంగా ఆకట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ జాతీయ స్థాయికి ఎంపికైంది.
కైకరం ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న నెర్సు కుసుమ లత తండ్రి శ్రీను ఏలూరు జూట్ మిల్లులో పనిచేస్తారు. అమ్మమ్మ ఇంటి వద్ద ఉండి చదువుతోంది. గ్రామ వలంటీరు విజయ, ముఠా కార్మికుడు నాగ శేషుల కుమారుడు పొడుగు రామ్ చరణ్ సాయి ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. వారిద్దరిని ప్రోత్సహించిన ఫిజిక్స్ ఉపాధ్యాయుడు కునాతి జాన్ తానే గైడ్గా ప్రాజెక్ట్ రూపొందించడంలో వెన్నంటి ఉన్నారు. వారి ప్రాజెక్ట్ జాతీయ స్థాయికి ఎంపిక కావడం గ్రామీణ విద్యార్థులకు స్ఫూర్తినిస్తుందని జాన్ ఆనందంగా చెప్పారు. విద్యార్థులతో పాటు గైడ్ జాన్ను పాఠశాల హెచ్ఎం గుళ్ల ప్రసాద రావు అభినందించారు. విద్యార్థులు, గైడ్, హెచ్ఎం కలసి శనివారం కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ను కలిశారు. విద్యార్థులను, ప్రోత్సహించిన ఉపాధ్యాయులను కలెక్టర్, అధికారులు అభినందించారు. కలెక్టర్ను కలసిన వారిలో డీఈవో పి.శ్యాం సుందర్, జిల్లా కో–ఆర్డినేటర్ రామారావు, బి.భాస్కరరావు ఉన్నారు.