నేటితో రేవు నిర్వహణ గడువు పూర్తి
ABN , First Publish Date - 2023-03-31T00:14:25+05:30 IST
నరసాపురం – సఖినేటిపల్లి రేవు నిర్వహణ బాధ్యతల గడువు శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త పాటదారుడికి అప్పగించాల్సి ఉండగా, ఈ నెల 21న జరిగిన వేలం రద్దు అయ్యింది.
రేపటి నుంచి బాధ్యత ఎవరిది ?
నరసాపురం, మార్చి 30 : నరసాపురం – సఖినేటిపల్లి రేవు నిర్వహణ బాధ్యతల గడువు శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త పాటదారుడికి అప్పగించాల్సి ఉండగా, ఈ నెల 21న జరిగిన వేలం రద్దు అయ్యింది. మళ్లీ ఏప్రిల్ 6న వేలం నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చారు. శనివారంతో షెడ్యూల్ విక్రయ గడువు ముగియనుండగా, ఇప్పటి వరకు కనీసం ఒక్కటి అమ్ముడుపోలేదు. దీంతో ఈ సారి పాటలో ఎంత మంది కాంట్రాక్టర్లు పాల్గొంటారన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. గత ఏడాది పాటలో ఎక్కువ మంది పోటీ పడడంతో ప్రభుత్వానికి రూ.2.75 కోట్ల ఆదాయం లభించింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి పాట ప్రారంభ ధరను రూ.2.17 కోట్లుగా నిర్ణయించారు. ఈసారి గతంకంటే ఆదాయం ఎక్కువ వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో పాడేందుకు కాంట్రాక్టర్లు మక్కువ చూపించడం లేదు. ఈ కారణంగానే ఈ నెలలో నిర్వహించిన పాటలో ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ఒకటో తేదీ నుంచి రేవు నిర్వహణ బాధ్యతలను తాత్కాలికంగా ప్రస్తుత పాటదారునికే అప్పగిస్తారా..? లేక ప్రభుత్వమే చేపడుతుందా ? చూడాలి.