కొల్లేరు కొంగుబంగారం
ABN , First Publish Date - 2023-02-21T00:50:57+05:30 IST
కోరిన కోర్కెలను తీర్చి కల్పవల్లిగా విరాజిల్లుతున్న కొల్లేటికోట పెద్దింటి అమ్మవారి జాతర మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది.
మార్చి 3న అమ్మవారి కల్యాణం
కైకలూరు, ఫిబ్రవరి 20: కోరిన కోర్కెలను తీర్చి కల్పవల్లిగా విరాజిల్లుతున్న కొల్లేటికోట పెద్దింటి అమ్మవారి జాతర మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొల్లేరు సరస్సు నడుబొడ్డున కొలువై శతాబ్ధాల కాలంగా భక్తుల పూజలు అందుకుంటున్న అమ్మవారి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవస్థాన కమిటీ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. దక్షిణ కాశ్మీరంగా పేరుగాంచిన కొల్లేరు సుందరతీరాన పద్మాసన భంగిమలో కొలువై యున్న కైకలూరు మండలం కొల్లేటికోట పెద్దింటి అమ్మవారి జాతర మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. కొల్లేరు ప్రజల కొంగుబంగారంగా అమ్మవారిని పిలుస్తారు. ప్రతి ఏటా పందిరిపల్లిగూడెం నుంచి సారెతో, ప్రభలతో ఊరేగింపుతో ఎంతో అట్టహాసంగా జరుగుతుంది. దేశంలో ఎక్కడ స్థిరపడిన కొల్లేరు ప్రజలు ఈ జాతర మహోత్సవాలకు విచ్చేస్తారు. పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మవారికి వేడి నైవేద్యాలను సమర్పిస్తారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో పాలపొంగళ్ళను పొంగించి అమ్మవారికి అందిస్తారు.
పార్వతీదేవి ప్రతిరూపమే
సాక్షాత్తు పార్వతీదేవీ ప్రతిరూపమే కొల్లేటికోట పెద్దింటి అమ్మవారని ఇక్కడ ప్రజలు కొల్లుస్తారు. 9 అడుగుల ఎత్తు, విశాలనేత్రాలతో పద్మాసన భంగిమలో భక్తులకు దర్శనమిస్తారు. 11 శతాబ్దంలో వేంగి చాలుక్య రాజుల కాలంలో అమ్మవారు వెలిశారు. కొల్లేటికోటను కొలనువీడుగా పిలిచేవారు. ఇటీవల డ్రోన్ కెమెరాలలో కొల్లేరు అందాలను చిత్రీకరించినపుడు కొల్లేటికోట గ్రామం చుట్టూ వృత్తాకారంలో గోడ ఉన్నట్లుగా కనిపిస్తున్నది.
మార్చి 7 వరకు ఉత్సవాలు
ప్రతి ఏటా పాల్గున శుద్ధ పాఢ్యమి మొదలు పౌర్ణమి వరకు జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరి 21 నుంచి మార్చి 7 వరకు ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా మార్చి 3న జలదుర్గా గోకర్ణేశ్వర కల్యాణం జరుపుతారు. బోనాలు, కలువమ్మల గ్రామో త్సవం నిర్వహిస్తారు. అమ్మవారి ఆలయానికి 3 మైళ్ళ దూరంలో గోకర్ణపురంలో ఉన్న గోకర్ణేశ్వర స్వామివారిని పల్లకిలో ఊరేగింపుగా కొల్లేటికోటకు తీసుకువస్తారు. గోకర్ణపురంలోని గోకర్ణేశ్వరస్వామి వారిని, పెద్దింటి అమ్మగా పిలువ బడే జలదుర్గా అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని కనులపండువుగా నిర్వహిస్తారు. చివరి రోజున తెప్పోత్సవం నిర్వహిస్తారు.
ఆలయానికి ఇలా
పామర్రు – దిగమర్రు జాతీయ రహదారిలో కైకలూరు మండలం ఆలపాడు వద్ద బస్సు దిగాలి. అక్కడ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మవారి దేవస్థానానికి చేరుకోవచ్చు. మార్గ మధ్యలో సర్కార్ కాల్వపై ఇనుమ వంతెనపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఆ ప్రదేశంలో నూతన పెద్దింటి అమ్మవారి వారధి నిర్మాణాలను చూడవచ్చు. అదే విధంగా రైలు మార్గంలో విజయవాడ నుంచి భీమవరం వెళ్ళే మార్గంలో ప్రతి రైలు కైకలూరు, ఆకివీడులో హాల్ట్ ఉంటుంది. ఆయా గ్రామాల్లో దిగి కైకలూరు మండలం ఆలపాడు చేరుకోవచ్చు. ఆటోలు, కార్లలో పెద్దింటి అమ్మవారి ఆలయానికి చేరుకోవచ్చు.