సైకో పోవాలి
ABN , First Publish Date - 2023-09-22T00:18:32+05:30 IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ను తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా ఖండించారు. మహిళలు నిరసన తెలిపారు. సైకో పోవాలి...సైకిల్ రావాలంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు నిజాయతీగా బయటకు వస్తారని ఆకాంక్షించారు.
బాబుతోనే మేము
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా
నినదించిన మహిళలు
9వ రోజుకు చేరిన దీక్షలు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ను తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా ఖండించారు. మహిళలు నిరసన తెలిపారు. సైకో పోవాలి...సైకిల్ రావాలంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు నిజాయతీగా బయటకు వస్తారని ఆకాంక్షించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గురువారం నిరసన దీక్షలు ఉధృతంగా సాగాయి. భీమవరంలో మహిళలు చెవిలో పువ్వుపెట్టుకుని నిరసన కొనసాగించారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు, తెలుగుదేశం రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథిలు సంఘీభావం తెలిపారు. తాడేపల్లిగూడెంలో మహిళలు రిలేదీక్ష నిర్వహించారు. శిబిరంలోనే హనుమాన్ చాలీసా పటించారు. ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహించారు. గోమాతను పూజించారు. నియోజకవర్గ ఇన్చార్జ్ వలవల బాబ్జి, నర్సాపురం నియోజకవర్గ ఇన్చార్జి పొత్తూరి రామరాజులు మద్దతు తెలిపారు. కుట్రపూరితంగా చంద్రబాబును ఇరికించారని దుయ్యబట్టారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, తెలుగుమహిళ రాష్ట్ర కార్యదర్శి దాసరి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. తణుకులో తెలుగురైతు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో రైతులు హాజరయ్యారు. నియోకజవర్గ ఇన్చార్జ్ ఆరిమిల్లి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకట కృష్ణారావులు సంఘీభావం తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పతనం ఖాయమని దుమ్మెత్తి పోశారు. ఆచంటలో తెలుగుయువత నాయకులు దీక్షలో కూర్చున్నారు. వందలాది మందితో పోస్టు కార్డులతో సంతకాలు చేయించి ‘‘బాబు వెంటే మేమున్నాం..మీ ఆరోగ్యం క్షేమంగా ఉండి త్వరగా బయటకు రావాలని’’ కోరుతూ రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటున్న చంద్రబాబుకు పోస్టు కార్డులు పంపించారు. పాలకొల్లులో బీసీ సంఘ నాయకులు దీక్ష వహించారు. బాబుతోనే మేము సైతం అంటూ నినాదాలు చేశారు. బీసీ నాయకులు అంగర వీరభద్ర కుమార్, కడలి గోపాలరావు, కోడే విజయభాస్కర్, పెచ్చెట్టి బాబు, బీరక ప్రసాద్, మామిడివెట్టి ప్రసాద్రాజులు పాల్గొన్నారు. నర్సాపురంలో తెలుగు రైతు నాయకులు, ముస్లిం సోదరులు రిలేదీక్ష చేపట్టారు. నియోజకవర్గ ఇన్ఛార్జి పొత్తూరి రామరాజు నాయకత్వంలో చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. ముస్లిం నాయకులు బడేవల్లి, మౌళాలి, అలీషా, తెలుగు రైతు నాయకులు పాకన వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గంలోనూ మహిళలు నిరసన తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.బాబుతోనే మేమంటూ మద్దతు ప్రకటించారు. నియోజకవర్గ తెలుగుమహిళ రూత్కళ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యే రామరాజు సతీమణి సుష్మ నిమ్మరసం అందించి దీక్ష విరమింపజేశారు. ఆచంటలో తెలుగు యువత నిరసన తెలిపింది. పోస్ట్కార్డు ఉద్యమం నిర్వహించారు. చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు.