ఏపీవోలపై చర్యలు తీసుకోండి
ABN , First Publish Date - 2023-06-11T00:17:08+05:30 IST
ఉపాధి కూలీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఏపీవోలపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికసంఘం నాయకులు డిమాండ్ చేశారు.
ఏలూరు కలెక్టరేట్/ఏలూరు టూటౌన్,జూన్ 10: ఉపాధి కూలీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఏపీవోలపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికసంఘం నాయకులు డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో శనివారం జిల్లా డ్వామా పీడీ ఎ.రాముకు వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్ష, కార్య దర్శులు ఎం. జీవరత్నం, పి. రామకృష్ణ మాట్లాడుతూ, ఉపాధి హామీలో నేడు అన్ని స్ధాయిల్లో అవినీతి కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు కూలీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని ప్రాంతాల్లో అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ అధికారుల కనుసన్నల్లోనే డబ్బులు వసూలు దందా జరుగుతుందన్నారు. పెదవేగి మండలం లక్ష్మీపురంలో ఫీల్డ్ అసిస్టెంట్ లేకుండానే గ్రామ వలంటీర్ల ద్వారా అటెండెన్సు వేయించడం చట్టవిరుద్దమన్నారు. పి.ముత్యాలమ్మ, ఎస్. మహంకాళి, టి. సత్యనారాయణ, ఎం. సుధారాణి, మాధవ, ప్రభాకర్, సీత తదితరులు పాల్గొన్నారు.