మా వల్ల కాదు
ABN , First Publish Date - 2023-03-05T00:00:15+05:30 IST
ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతలను ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల నుంచి తప్పించాలని ఏపీ పీఏసీఎస్ సీఈవోల సంఘాలు ఉద్యమం చేపట్టాయి.
ధాన్యం కొనుగోళ్లు నిర్వహించలేం
తేల్చి చెబుతున్న సహకార సంఘాలు
కమీషనులో భారీ కోత.. ఖర్చుల భారం
ఇతర శాఖల సహాయ నిరాకరణ
పౌరసరఫరాల ఎండీ దృష్టికి సమస్యలు
భీమవరం, మార్చి 4 : ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతలను ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల నుంచి తప్పించాలని ఏపీ పీఏసీఎస్ సీఈవోల సంఘాలు ఉద్యమం చేపట్టాయి. ఇప్పటికే ఈ విషయం ఏపీ పౌరసరఫరాల శాఖ ఎండీ దృష్టికి తీసుకెళ్ళారు. జిల్లాల వారీగా సొసైటీలు తమ డిమాండ్ను కలెక్టర్, సహకార శాఖల దృష్టికి తీసుకెళుతున్నాయి. వచ్చే రబీ పంట కాలంలో తాము ధాన్యం కొనుగోళ్లు చేపట్టబోమని తెగేసి చెపుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ భారంగా మారిందని, సంఘాల్లో ఉద్యోగుల నియామకాలను నిలిపివేయడంతో సిబ్బందికి పని భారం పెరిగిందని ధాన్యం కొనుగోలు విధులు నిర్వహించడం కష్టంగా ఉందన్నారు. సంఘాలకు సైతం నష్టం వాటిల్లుతోందని ప్రభుత్వం కేటాయించిన నిధులు చాలడం లేదంటున్నారు. సంఘాల సిబ్బందికి భారం కాకుండా టెక్నికల్ అసిస్టెంట్లను నియమించాలని కోరుతున్నారు.
కష్టాలకు తోడు నష్టాలు కూడా
ధాన్యం కొనుగోలు బాధ్యత సహకార సంఘాలతో పాటు పౌరసరఫరాల రెవెన్యూ వ్యవసాయ శాఖ సమంగా పంచుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ బాధ్యత మొత్తాన్ని సహకార సంఘాలపైకి నెట్టివేశారని కొంతకాలంగా ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. రైతులకు సంచులు కావాల్సి వచ్చినప్పుడు రెవెన్యూ, పౌరసరఫరాలశాఖ బాధ్యత వహించాలి. ధాన్యం సంచులకోసం అడిగితే పలనా రైస్ మిల్లులో ఉన్నాయి.. తీసుకోవా లంటూ పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతుం టారు. ధాన్యం సంచులు తీసుకురావాలంటే రైస్ మిల్లుర్లు తమకు సంబంధం లేదని లారీ కిరాయి మీరే పెట్టుకోవాలని చెప్పడంతో దానికి వేల రూపాయలు ఖర్చు పెట్టి సొసైటీలు తెచ్చుకుంటున్నాయి. వాస్తవానికి ఈ ఖర్చు పౌరసరఫరాల శాఖ భరించాలి.
కమీషన్లో భారీగా కోత
ఇక ధాన్యం కొనుగోలు చేసినందుకు గతం నుంచి ఇస్తున్న కమీషన్లో భారీ కోత విధించారు. గతంలో క్వింటాకు రూ.31.25 కమీషన్గా ఇచ్చేవారు. కొంతకాలం కిందట ఈ మొత్తంలో 25 రూపాయిలను హమాలీల సాధ్యులుగా చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో కేవలం 6.25 పైసలు మాత్రమే వీరికి కమీషన్గా అందుతోంది. ధాన్యం కొనుగోళ్ల సమయంలో సహకార సంఘాల కార్యకలాపాలు నిలిపివేస్తారు. అటువంటప్పుడు కమీషన్ కూడా కోత పడితే నిర్వహణ కష్టంగా మారుతుందనేది సహకార సంఘాల ప్రధాన ఆవేదన. దీనికి తోడు వచ్చిన కమీషన్ కూడా డీసీసీబీలో డిపాజిట్ కావడంతో అది కూడా సొసైటీలకు చేరని పరిస్థితి. ధాన్యం కొనుగోళ్లు తమవల్ల కాదని రాబోయే పంటకాలం నుంచి ధాన్యం కొనుగోలు చేయమని స్పష్టం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల ఉద్యోగుల రాష్ట్ర యూనియన్ రాష్ట్రకార్యదర్శి నీలం నాగేశ్వరరావు ఇప్పటికే తమ సమస్యలపై ప్రభుత్వానికి వినతిపత్రం అందజేశారు.