బొండు..గుండు
ABN , First Publish Date - 2023-05-18T00:14:01+05:30 IST
తీర ప్రాంతంలో బొండు ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగు తున్నాయి. అధికారులు ఇటీవల కొరడా ఝులిపించ డంతో కొంత కాలం సర్దుమణిగినా మళ్లీ వారం నుంచి అక్రమార్కులు చీకటి దందాను మొదలు పెట్టేశారు.
తీర ప్రాంతంలో యథేచ్ఛగా ఇసుక తరలింపు
అక్కడ తవ్వకాలు.. ఇక్కడ గుట్టలే గుట్టలు
రాత్రి వేళల్లో సరిహద్దులు దాటుతున్న లారీలు, ట్రాక్టర్లు
అధికార పార్టీ మద్దతు..రెండు శాఖల అధికారులదే హవా
చేతులు మారుతున్న లక్షలు.. అంతా గప్చుప్
నరసాపురం/మొగల్తూరు, మే 17 : తీర ప్రాంతంలో బొండు ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగు తున్నాయి. అధికారులు ఇటీవల కొరడా ఝులిపించ డంతో కొంత కాలం సర్దుమణిగినా మళ్లీ వారం నుంచి అక్రమార్కులు చీకటి దందాను మొదలు పెట్టేశారు. రెండు శాఖల అధికారుల కను సన్నలలోనే ఈ వ్యవహారం మొత్తం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాని, ఎవరూ పట్టించుకోవడం లేదు.
నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని తీరగ్రామాల్లోని ఎక్కువ శాతం చవుడు భూములే. వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహానికి పొలాల్లో ఇసుక మేటలు వేయడం పరిపాటి. గతంలో రైతులు ఈ ఇసుకను ఉచితంగా ఇచ్చేవారు. అప్పట్లో రియల్ ఎస్టేట్, ఇంటి పూడిక పనులకు ఈ ఇసుకను ఎవరూ వినియోగించేవారు కాదు. ఇటీవల మట్టి కొరత ఏర్పడటంతో ఇప్పుడు అందరికి దృష్టి దీనిపై పడింది. దీంతో ఇది కాసులు కురిపిస్తోంది. గతంలో ట్రాక్టర్ ఇసుక రూ.500 పలికేది. నేడు రూ.2 వేలకు చేరింది. ఇటు జాతీయ రహదారి పూడిక పనులకు దీనినే వాడుతుండటంతో డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొందరు అక్రమార్కుల కన్ను సముద్ర తీరంపై పడింది. రైతుల వద్ద కొనేకంటే సముద్ర ఒడ్డునే తవ్వుకోవడం లాభదాయకమని భావించిన అక్రమార్కులు నేతల అండ దండలతో జేసీబీలు విని యోగించి తీరం వెంబడి, సీఆర్ఆర్, డి నమూనా భూముల్ల్లో తవ్వకాలు చేపట్టారు. తవ్విన ఇసుకను గుట్టలుగా పోస్తున్నారు. నరసాపురం మండలం చిన లంక, పీఎం లంక, మొగల్తూరు మండలం కేపీ పాలెం, పేరు పాలెం, కొత్తోట గ్రామాల్లో దందా సాగుతోంది.
గుట్టలు..గుట్టలు
ఇక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకే కాకుండా ఏలూరు, కోనసీమ, కృష్ణా జిల్లాలకు ఎగుమతి అవుతోంది. ముందుగా కేపీ పాలెం తోటల్లో గుట్టలు గుట్టలుగా వేసి రాత్రి ఎనిమిది గంటల నుంచి తెల్లవారుజామున మూడు వరకూ ట్రాక్టర్లు, లారీల్లో ఇసుక సరిహద్దులు దాటిస్తున్నారు. నిత్యం లక్షల విలువైన ఇసుక తరలిపోతున్నా, ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి జమ కావడం లేదు. నెలవారీగా లక్షల రూపాయలు ముడుపులు ఇస్తుండడంతో రెండు శాఖల అధికారులు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీడియాలో కథనాలు వచ్చినప్పుడు అధికారులు హడావుడి చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప ఈ దందాపై ఉక్కు పాదం మోపడం లేదు. కొందరు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఈ చీకటి దందా నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల మైనింగ్ అధికారులు హడావుడి చేసి అక్రమ మట్టిపై ల్యాండ్ ట్యాక్స్ పేరిట పెనాల్టీ విధించారు. మళ్లీ సీన్ రిపీట్ అయ్యింది.