విద్యార్థులకు రాగి జావ
ABN , First Publish Date - 2023-02-21T23:22:58+05:30 IST
మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా అదనపు ఆహారంగా రాగి జావను మార్చి రెండో తేదీ నుంచి బాల,బాలికలకు పంపిణీ చేయడానికి రంగం సిద్ధమవుతోంది.
2 నుంచి పాఠశాలల్లో ప్రారంభం
నేడు రెండు స్కూళ్ళలో మాక్ ఎక్స్ర్సైజ్ డ్రిల్
తయారీపై కుక్ కం హెల్పర్లకు శిక్షణ
ఏలూరు ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 21 : మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా అదనపు ఆహారంగా రాగి జావను మార్చి రెండో తేదీ నుంచి బాల,బాలికలకు పంపిణీ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. రాగుల పిండి, బెల్లంపొడితో తయారు చేసిన రాగిజావను ప్రతీ మంగళ, గురు, శనివారాల్లో విద్యార్థికి 150 మి.లీ. చొప్పున పంపిణీ చేయడానికి నిర్ణయించారు. రాగిజావ తయారీపై మంగళవారం వెబెక్స్ విధానంలో జిల్లాలోని ఆరుగురు కుక్ కం హెల్పర్లు, ఇద్దరేసి ఎంఈవోలు, హెచ్ఎంలకు శిక్షణ ఇచ్చారు. ముందుగా ఏలూరు సమీపంలోని పెదపాడు జడ్పీ హైస్కూలు, కొవ్వలి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో బుధవారం మాక్ ఎక్స్ర్సైజ్ డ్రిల్ను నిర్వహించి రాగిజావ తయారీ, పంపిణీలను పరిశీలించి లోటుపాట్లపై సమీక్షించనున్నారు. అనంతరం మార్చి రెండో తేదీ నుంచి జిల్లాలోని 1,818 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో రాగిజావ పంపిణీ ఉంటుంది. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు మొత్తం 1,49,395 మంది బాల బాలికలు చదువుతుండగా, వీరిలో 1,06,913 మంది మాత్రమే మధ్యాహ్న భోజన పథకాన్ని వినియోగించుకుంటున్నారు. కొత్తగా చేపట్టనున్న రాగిజావ పంపిణీని పాఠశాలల్లో ఉదయం తరగతులు ప్రారంభమయ్యేలోగా అంటే 8.45 గంటలకే విద్యార్థులకు ఇవ్వాలని ఆదేశించారు. కాగా రాగిజావ తయారీ నిమిత్తం కుక్ కం హెల్పర్లకు అదనపు పారితోషికం లేదా గౌరవ వేతనం పెంపుదలపై మంగళవారం వరకు ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. రాగుల పిండి, బెల్లం పొడిలను పదిరోజులకోసారి నేరుగా స్కూల్ పాయింట్కు ఓ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా చేరుస్తారు. జావ నిమిత్తం విద్యార్థులకు ప్రత్యేకంగా స్టెయిన్లెస్ స్టీలు గ్లాసులను ఇచ్చే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.