ఆన్‌లైన్‌ మోసాలకు బలి కావద్దు : ఎస్పీ

ABN , First Publish Date - 2023-03-28T00:05:00+05:30 IST

ప్రజలు ఆన్‌లైన్‌ మోసాలకు బలికావద్దని, అపరిచిత మెస్సేజ్‌లు పట్ల జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ అన్నారు.

ఆన్‌లైన్‌ మోసాలకు బలి కావద్దు : ఎస్పీ
స్పందనలో మహిళ సమస్య వింటున్న ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ

ఏలూరు రూరల్‌, మార్చి 27 : ప్రజలు ఆన్‌లైన్‌ మోసాలకు బలికావద్దని, అపరిచిత మెస్సేజ్‌లు పట్ల జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ అన్నారు. ఎస్పీ ప్రధాన కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు వచ్చి ఫిర్యాదులు అందజేశారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.

ఒక ఆయిల్‌కు సంబంధించి డిస్ర్టిబ్యూషన్‌ ఇప్పిస్తానని ఐదు లక్షలు తీసుకుని ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆగిరిపల్లికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.

తన కుమార్తె మరణానంతరం మనవడు, మనవరాలకు ఆస్తిని రాసిస్తానని చెప్పి హామీ పత్రం ఇచ్చి నేటి వరకూ ఎటువంటి సమాధానం చెప్పడంలేదని తనకు న్యాయం చేయాలని పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెందిన ఓ వ్యక్తి ఎస్పీని కలిసి న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశాడు.

భర్త అసత్య ఆరోపణలతో కేసు వేసి విడాకులు కోసం వేధిస్తున్నాడని మరో మహిళను వివాహం చేసుకున్నాడని న్యాయం చేయాలని నూజీవీడుకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు.

తన భర్త చెడు వ్యసనాలకు లోనై పలు కేసుల్లో నేరస్తుడుగా ఉన్నాడని ఇటీవల ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి హత్యాయత్నానికి పాల్పడ్డాడని న్యాయం చేయాలని సుంకరవారితోటకు చెందిన ఓ మహిళ కోరింది.

Updated Date - 2023-03-28T00:05:00+05:30 IST