ముందుగా వచ్చి.. మోసపోయాం !
ABN , First Publish Date - 2023-08-23T00:14:51+05:30 IST
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ముందుగా పునరావాసాలకు తరలించిన ఎనిమిది గ్రామాల్లో తోటగొంది, రామన్నపాలెం ఉన్నాయి. 2015లో అప్పటి సీఎం దివంగత వైఎస్ఆర్ హయాంలో గ్రామాలను పునరావాసాలకు తరలించారు.
తోటగొంది, రామన్నపాలెం పునరావాస గ్రామస్థుల వేదన
సెకండ్ ఫేజ్ పరిహారాలు అమలు చేయాలంటూ డిమాండ్
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ముందుగా పునరావాసాలకు తరలించిన ఎనిమిది గ్రామాల్లో తోటగొంది, రామన్నపాలెం ఉన్నాయి. 2015లో అప్పటి సీఎం దివంగత వైఎస్ఆర్ హయాంలో గ్రామాలను పునరావాసాలకు తరలించారు. ఆయా గ్రామాలకు ముందుగా ప్రకటించిన పరిహారం మాత్రమే ఇచ్చారు. అదనపు ప్యాకేజీలు ఇవ్వలేదు. మంచినీటి సదుపాయం, వాటర్ ట్యాంకుల మరమ్మతులు చేయలేదని ఉపాధి లేక అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. పాదయాత్ర సమయంలో ప్రస్తుతం సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని విన్నవిస్తున్నారు.
పోలవరం, ఆగస్టు 22 : ముందుగా వచ్చిన వారికి పరిహారంగా రూ.లక్ష చివరగా వచ్చిన వారికి రూ. పది లక్షలా.. మేమేం పాపం చేశాం... అధికారుల మాట విని గ్రామాన్ని వీడి వచ్చినందుకు మాకు ఇదా న్యాయం అంటూ తోటగొంది పునరావాస గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాల్వ నిర్మాణంలో భాగంగా నిర్మించిన జంట గుహలు, కుడి ప్రధాన కాల్వ దిగువ హెడ్ రెగ్యులేటర్ నిర్మాణ ప్రాంతం తోటగొంది పరిధిలోనే ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ముందుగా తరలించిన ఎనిమిది గ్రామాల్లో తోటగొంది ఒకటి. గతంలో ఇటుకల కోట పంచాయతీలో ఉండే ఈ గ్రామాన్ని వింజరం పంచాయతీ శివారుకి తరలించారు. గ్రామాలు తరలించినా వారికి ఇళ్లు కట్టలేదు. తమ సొంత ఖర్చులతో ఇళ్లు నిర్మించుకున్నారు. గ్రామంలో డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేక వర్షాల సీజనులో కొండవాగుల నీటితో గ్రామం జలమయమవుతోంది. ఈ గ్రామాన్ని జూన్ 12వ తేదీ 2015లో తరలించారు. ఈ గ్రామంలో 69.17 ఎకరాల భూమిని సేకరించారు. 69 కుటుంబాలను తరలించారు. రూ.లక్ష ప్యాకేజీ, రూ.20 వేలు పరిహారం మాత్రమే ఇచ్చారు. అదనపు పరిహారం కోసం ఐటీడీఏకి వెళ్లి అధికారులను అడిగినా ఫలితం లేదు. అదనపు పరిహారం ఇవ్వలేదు. 18 సంవత్సరాల వారికి స్థలాలు ఇచ్చారే గానీ ఇళ్ళు గానీ పరిహారం గానీ అందలేదు. సీఎం ప్రకటించిన అదనపు పరిహారం కుటుంబ ప్యాకేజీ, ఎకరాకు 5 లక్షల పరిహారం ఇవ్వలేదు.
ఎకరాకు రూ.5 లక్షల ప్యాకేజీ ఇవ్వాలి
మాకు అదనంగా ప్రకటించిన కుటుంబ ప్యాకేజీ రూ.10 లక్షలు, ఎకరాకి రూ.5 లక్షల ప్యాకేజీ ఇవ్వాలి. డ్రెయినేజీలు నిర్మించాలి. మంచినీటి సదుపాయం కల్పించాలి. వాటర్ ట్యాంకుకు మరమ్మతులు చేయించాలి. 18 ఏళ్లు నిండిన యువతకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. ఉపాధి లేక అవస్థలు పడుతున్నాం.. ఉపాధి కల్పించాలి. రుణాలు మంజూరు చేయాలి.
– కోటం గంగాదేవి, తోటగొంది నిర్వాసితురాలు
అయ్యో‘రామ’న్నపాలెం..
ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పోలవరం మండలంలో ముందుగా తరలించిన గ్రామాల్లో మొదటిది ప్రగడపల్లి పంచాయతీలోని రామన్నపాలెం. కుడి ప్రధాన కాల్వ నిర్మాణంలో భాగంగా అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో 2015 సంవత్సరం జూలై 29న గ్రామాన్ని తరలించారు. తరలించి ఎనిమిదేళ్లయినా 42 ఇళ్లు, 20 కుటుంబాలకు మరుగుదొడ్లు కట్టారు. మిగిలిన వారికి మరుగుదొడ్లు కట్టలేదు. పరిహారం రూ.3.15 లక్షలు మాత్రమే ఇచ్చారు. అయితే మా తర్వాత నిర్మించిన పునరావాస కాలనీలకు రూ.10 లక్షల ప్యాకేజీ ఇచ్చారని, మాకు మాత్రం అదనపు ప్యాకేజీలు ఏమీ ఇవ్వలేదని, అధికారులను అడిగితే మీ గ్రామం మా సిస్టంలోనే లేదని చెబుతున్నారని నిర్వాసితులు వాపోతున్నారు. డ్రెయినేజీలు లేక వర్షాలకు గ్రామంలో నీరు నిలిచి ఇబ్బందులకు గురవుతున్నారు. 20 మందికి పైగా 18 ఏళ్లు నిండిన వారికి ప్యాకేజీ ఇవ్వలేదు. బోరులో సుద్ద నీరు రావడంతో తాగడానికి పని చేయడం లేదు. పాదయాత్ర సమయంలో జగన్ ముందుగా తరలించిన గ్రామాలకు రూ.పది లక్షల పరిహారం ఇస్తానని హామీ ఇచ్చారే గానీ అమలు కాలేదని వాపోతున్నారు.
జాబితాలో లేదంటున్నారు..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కుడి కాల్వలో ముందుగా త రలించిన గ్రామం మాది . మాకు ఎలాంటి వసతులు , మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఇప్పటికీ మరుగుదొడ్లు లేక అడవుల్లోకి వెళ్లాల్సి వస్తోంది. ప్రకటించిన ప్యాకేజీలు రాలేదు. అధికారులను అడిగితే రామన్నపాలెం నిర్వాసిత గ్రామాల జాబితాలో లేదంటూ సమాధానాలిస్తున్నారు.
– కొవ్వాసి చిన దుర్గ, రామన్నపాలెం పునరావాస కాలనీ