పట్టిసీమ నీరేదీ ?

ABN , First Publish Date - 2023-03-05T23:52:19+05:30 IST

పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పంపిణీ అయ్యే సాగు నీటితో ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు అటు కృష్ణా రాయలసీమలలో లక్షలాది ఎకరాల పంట భూములు సస్య శ్యామలమై మూడు పంటలు పండించుకునేవారు.

పట్టిసీమ నీరేదీ ?
పట్టిసీమ ఎత్తిపోతల పంపులు

మూడేళ్లలో విడుదల చేసింది 41 టీఎంసీలు మాత్రమే

గత ప్రభుత్వ పాలనలో 305 టీఎంసీలు పంపిణీ

పోలవరం, మార్చి 5 : పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పంపిణీ అయ్యే సాగు నీటితో ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు అటు కృష్ణా రాయలసీమలలో లక్షలాది ఎకరాల పంట భూములు సస్య శ్యామలమై మూడు పంటలు పండించుకునేవారు. కృష్ణా డెల్టాకు, రాయలసీమకు సాగు నీటి కొరత లేదని ప్రభుత్వం పట్టిసీమను నిలిపివేశారు. మూడున్నరేళ్ళలో ఈ ఎత్తిపోతల పథకం ద్వారా నీటి పంపిణీ లేకపోవడంతో పశ్చిమ డెల్టాలో రైతులకు రబీకి పట్టిసీమ నీటిపై ఆధారపడిన రైతులకు రబీ సాగు గడ్డుకాలంగా పరిణమించి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ పరిధిలో కుడి ఎడమల పట్టిసీమ నీటిపై ఆధారపడిన రైతులకు రబీ పంట సాగు కష్టతరంగా మారడంతో పంటల సాగు కోసం చేసిన అప్పులు తీరక పలు అవస్థలకు గురవుతున్నారు. బోరు ఉన్న రైతులకు నీటి తడుల కోసం సొమ్ములు చెల్లించి కొంతమంది సాగు చేస్తుంటే మరి కొంతమంది రైతులు నీరు లేక పంట విరామం పాటించే పరిస్థితులు నెలకొన్నాయి. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభం నుంచి 2019 రబీ సీజన్‌ వరకు 305.07 టీఎంసీల గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా కృష్ణా, రాయలసీమకు సాగు నీటిని పంపీణీ చేసిన జలవనరులశాఖ అఽధికారులు 2020 జూన్‌ 18న పట్టిసీమను ప్రారంభించి నవంబరు 24వ తేదీ వరకు 41.5424 టీఎంసీల నీటిని పంపిణీ చేశారు. అంటే గత ప్రభుత్వ పాలనలో 305 టిఎంసీల సాగునీటిని పట్టిసీమ ద్వారా పంపిణీ చేస్తే ప్రస్తుత ప్రభుత్వ పాలన ఆరంభం నుంచి నేటి వరకు 41 టీఎంసీల నీటిని మాత్రమే విడుదల చేశారు. నాటి నుంచి నేటి వరకు కృష్ణా డెల్టాకు నీటి అవసరం లేదని పట్టిసీమ నీటి పంపిణీ నిలిపివేయడంతో పోలవరం, గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల, కామవరపుకోట, దెందులూరు మండలాలలో లక్షా యాబై వేల ఎకరాల పంట భూముల సాగు రబీ సీజన్‌లో లేక రైతులు నష్టపోతున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి పట్టిసీమ నీటిని రబీ సీజనుకి అందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2023-03-05T23:52:19+05:30 IST