వానర.. విధ్వంసం

ABN , First Publish Date - 2023-02-06T01:21:12+05:30 IST

ఒకప్పుడు పల్లెల్లో కోడి కూస్తే తెల్లవారింది అని లేచేవారు. కాని నేడు కోతుల చప్పుడుతో లేవాల్సి వస్తోందని నూజివీడు పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు.

వానర.. విధ్వంసం
నూజివీడు పట్టణంలో ఇళ్లపైౖ వానరాల ఆగడాలు

ఊళ్లపై వందల కోతులు దాడి

ధ్వంసమవుతున్న ఇళ్లు, పంటలు

జనం గగ్గోలు.. వాటి నుంచి విముక్తి కల్పించాలని వేడుకోలు

(నూజివీడు టౌన్‌):

ఒకప్పుడు పల్లెల్లో కోడి కూస్తే తెల్లవారింది అని లేచేవారు. కాని నేడు కోతుల చప్పుడుతో లేవాల్సి వస్తోందని నూజివీడు పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు. కొంత కాలంగా వానరాలు ఇళ్లల్లోకి ప్రవేశించి ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నూజివీడు పట్టణంలోని గాంధీనగర్‌, అమ్మవారితోట, నెహ్రూపేట, బాపూనగర్‌తోపాటు మండలంలోని మిట్టగూడెం, హనుమంతు లగూడెం, అన్నవరం, తుక్కులూరు తదితర గ్రామాల్లో వందల సంఖ్యలో గ్రామాల్లోకి కోతులు ప్రవేశించి, ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రజల మీద దాడులు చేస్తున్నాయి. ఇలా వాటి ఆగడాలకు అంతే లేకపోతోంది. పురాతన పెంకుటిళ్ళు, ఇంటిపై పెంకులు, ఇంట్లోని సామగ్రిని ధ్వంసం చేస్తూ మను షులపై దాడులకు దిగుతున్నాయి. గ్రామాల్లోనూ, నూజివీడు పట్టణంలోనూ కోతుల దాడుల నేపథ్యంలో గాయాల పాలైన వారు ఉన్నారు. ఇళ్ళలోని వారు ఏ మాత్రం ఆదమరిచినా ఇంట్లోని వస్తువులన్ని చిందర వందర చేస్తూ కోతులు నానా రభస చేస్తున్నాయి. ఒకవేళ మనిషి చేతిలో సంచి, తినుబండారం కనిపిస్తే ఒక్కసారిగా మీద పడి రక్కుతూ లాక్కుపోతున్నాయి.

పంటలను కాపాడేందుకు

వానరాల బెడద కేవలం ఆవాసాల మఽధ్యేకాదు, అటు పొలాల్లోనూ విపరీతంగా ఉంది. ఉదయం లేచింది మొదలు పంటలపై కోతులు దాడులకు దిగటంతో వాటిని సంరక్షించేందుకు రైతులు ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వస్తోంది. మెట్ట ప్రాంతమైన నూజివీడు పరిసర ప్రాంతాల్లో రబీలో మొక్కజొన్న, పొగాకుతోపాటు సంప్రదాయ మామిడి అధిక మొత్తం లో సాగు చేస్తారు. దీంతో కోతుల తాకిడి మొక్క జొన్న, మామిడి తోటలపై అధికంగా ఉందని, గుంపులు, గుంపులుగా పంట పొలాలపై దాడులు చేస్తుండటంతో కోతులను తోలేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు పంట పొలాల్లోనే కాపలా కాయాల్సి వస్తోంద న్నారు. ఒకవేళ పొలాలపైకి వస్తున్న సందర్భంలో కాపలా వ్యక్తి ఒక్కరే ఉంటే అతడిపై దాడులు చేస్తున్నాయని, ఫలితంగా పంట నష్టంతోపాటు కోతుల దాడులతో రైతులు ఆసుపత్రుల పాలవ్వాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. గ్రామాల్లోని కోతులను పట్టి అటవీప్రాంతాల్లో వదలాలని రైతులు కోరుతున్నారు.

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులపై..

కోతుల ఆగడాలు ట్రిపుల్‌ ఐటీకి తప్పడం లేదు. ట్రిపుల్‌ఐటీ పరిసర ప్రాంతాల్లో కోతుల సంచారం విపరీ తంగా ఉండటంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ కోవలో శనివారం మధ్యాహ్నం ట్రిపుల్‌ ఐటీ విద్యార్థినిలు రేవంత్‌కుమారి, అరుణ కుమారిలపై కోతులు దాడి చేశాయి. దీంతో వారు నూజివీడు ఏరియా ఆసుపత్రిలో ప్రథమచికిత్స తీసుకున్నారు.

Updated Date - 2023-02-06T01:21:15+05:30 IST