బిల్లులు చెల్లించలేదని సచివాలయానికి తాళం
ABN , First Publish Date - 2023-04-21T00:22:59+05:30 IST
ప్రభుత్వం నిర్మిస్తున్న సచివాలయ భవనాలకు బిల్లులు రావట్లేదని రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టర్లు గగ్గోలు పెడు తున్నారు.
జంగారెడ్డిగూడెం టౌన్, ఏప్రిల్ 20 : ప్రభుత్వం నిర్మిస్తున్న సచివాలయ భవనాలకు బిల్లులు రావట్లేదని రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టర్లు గగ్గోలు పెడు తున్నారు. ఈకోవలోనే బిల్లులు చెల్లించలేదని జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట సచివాలయానికి గురువారం కాంట్రాక్టర్ తాళం వేశాడు. సచివాలయ భవనానికి స్థలాన్ని దానంగా ఇచ్చిన ఇర్ల శ్రీనివాసరెడ్డి, సచివాలయ భవన నిర్మాణానికి కాంట్రాక్టర్గా వ్యవహరించారు. భవనంలో ఇంకా పనులు పూర్తి కావాల్సి ఉందని, అయినప్పటికి పంచాయతీరాజ్ శాఖ పంచాయతీకి భవనాన్ని అప్పగించారని, అంతేకాక తనకు సుమారు రూ.20 లక్షలు వరకు బిల్లులు రావాల్సి ఉందని కాంట్రాక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈక్రమంలో సచివాలయ భవనానికి తాళం వేయడంతో విధులకు వచ్చిన సిబ్బంది బయటే వేచి ఉండాల్సి వచ్చింది. అయితే పంచాయతీరాజ్ అధికారులు రూ.8 లక్షలే చెల్లించాలని చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ స్లీవజోజి, ఎంపీడీవో కొమ్ము కిరణ్కుమార్ కార్యాలయ తాళాలు తీయించి సేవలు ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు.