వైద్యుల నిర్లక్ష్యంపై బంధువుల ఆందోళన !
ABN , First Publish Date - 2023-09-22T00:13:19+05:30 IST
జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన మగ శిశువు మృతి చెందడంపై వైద్యుల నిర్లక్ష్యమేనంటూ బంధువులు గురువారం ఆందోళన వ్యక్తం చేశారు.
జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిలో శిశువు మృతి
బంధువుల ఆందోళన.. వైద్యుల వివరణతో విరమణ
జంగారెడ్డిగూడెం, సెప్టెంబరు 21 : జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన మగ శిశువు మృతి చెందడంపై వైద్యుల నిర్లక్ష్యమేనంటూ బంధువులు గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. వివరాలివి.. స్థానిక రాజీవ్నగర్కు చెందిన సజ్జ మురళీకృష్ణ కుమార్తె హేమలతకు రాజమహేంద్రవరానికి చెందిన ఉల్లి వీరబాబుకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. గతంలో ఒక బిడ్డ ప్రసవానికి ఆపరేషన్ జరగగా రెండో బిడ్డ పురిటి కోసం హేమలతను ఈనెల 16న జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తీసుకురాగా ఇంజక్షన్ చేసి ఆదివారం ఇంటికి పంపారన్నారు. మళ్లీ గురువారం నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకురాగా ఆపరేషన్ చేసి మృతి చెందిన మగ శిశువును చేతుల్లో పెట్టారని కన్నీరు మున్నీరయ్యారు. కడుపులో బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని ముందస్తు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం కనబర్చారని ఆరోపించారు. ఆసుపత్రి ముఖ ద్వారం వద్ద బంధువులు బైఠాయించి న్యాయం చేయాలని నిరసన తెలిపారు. ఈ ఘటనపై ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీకమల వివరణ ఇచ్చారు. ఆమె నొప్పులతో బాధపడడం చూసి ఆపరేష న్కు సిద్ధం చేశామని, తల్లి ప్రాణానికి హాని కలగకుండా జాగ్రత్త తీసుకు న్నామన్నారు. ఆపరేషన్ చేసే సమయానికి కడుపులో మగబిడ్డ అప్పటికే మృతి చెంది ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. దీనిలో వైద్యుల నిర్లక్ష్యం లేదని వివరించారు. ఈ మేరకు బాధితులు ఆందోళన విరమించారు.