వైరస్లపై అప్రమత్తం
ABN , First Publish Date - 2023-09-20T00:36:04+05:30 IST
కేరళలో నిఫా, ఒడిషాలో స్క్రబ్ టైఫస్ వైరస్లు కలకలం రేపుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్తలపై అన్ని పీహెచ్సీల వైద్యాధికారులతో బుధవారం ఉదయం 10 గంటలకు వెబెక్స్ సమావేశాన్ని ఉన్నతాధికారులు నిర్వహించనున్నట్టు సమా చారం అందింది

నేడు వైద్యాధికారుల సమావేశం
ఏలూరు ఎడ్యుకేషన్, సెప్టెంబరు 19 : కేరళలో నిఫా, ఒడిషాలో స్క్రబ్ టైఫస్ వైరస్లు కలకలం రేపుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్తలపై అన్ని పీహెచ్సీల వైద్యాధికారులతో బుధవారం ఉదయం 10 గంటలకు వెబెక్స్ సమావేశాన్ని ఉన్నతాధికారులు నిర్వహించనున్నట్టు సమా చారం అందింది. వైరల్ జ్వరాలు విజృంబిస్తున్న వేళ నిర్వహించనున్న ఈ సమావేశంలో వైద్యాధి కారులకు పలు సూచనలు చేయడంతో పాటు, జిల్లావ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా జ్వరపీడితుల రక్తనమూనాల సేకరణ, ల్యాబ్లలో వైరస్ నిర్దారణ పరీక్షలు, ముందస్తు జాగ్రత్తలు తదితర అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో జంగారెడ్డిగూడెం, తణుకు, భీమవరం, చింతలపూడి, నూజివీడు, తాడేపల్లిగూడెంలలోని ఏరియా ఆస్పత్రుల్లో జ్వర పీడితుల రక్తనమూనాలను సేకరించి, నిర్దారణ పరీక్షలకు ఏలూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సెంటినల్ సర్వైలెన్స్ హాస్పిటల్ (ఎస్ఎస్హెచ్)కు పంపిస్తున్నారు. వర్షాకాలంలో సాధారణంగా మలేరియా, డెంగీ జ్వరాలు విజృంభిస్తుండగా, వీటికితోడు ఈ దఫా స్క్రబ్ టైఫస్, నిఫా, లెప్టో స్పైరా వైరస్లు ఇతర రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతుందటంతో వైద్యఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. జ్వరం, శరీరంపై ఎర్రని కాలిన మచ్చలు, పొడిదగ్గు, జలుబు, తీవ్ర ఒళ్ళునొప్పులు, తలపోటు, కళ్ళు ఎర్రబడటం, ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం తది తర లక్షణాలు వైరల్ జ్వరాలకు చెందినవిగా వైద్య వర్గాలు చెబుతున్నాయి. అయితే అన్ని జ్వరాలను ఒకేరకంగా చూడలేమని, ల్యాబ్ పరీక్షల్లోనే ఇవి నిర్దారణ అవుతాయని వివరించారు. జిల్లాలో ఇంతవరకు స్క్రబ్ టైఫస్, నిఫా, లెప్టో స్పైరా వైరస్ కేసులు ఎక్కడా నిర్దారణ కాలేదని డీఎస్వో డాక్టర్ నరేందర్ కృష్ణ వెల్లడించారు. అయినప్పటికీ గోదావరి వరదల దృష్ట్యా ఏలూరు జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో కొత్తరకం వైరస్లకు కార కాలైన దోమలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఎవరికైనా జ్వరం వస్తే స్థానికంగా వున్న పీహెచ్సీ లేదా అర్బన్ పీహెచ్సీల్లో సంప్రదిస్తే ఎలీజా టెస్ట్ చేసి వ్యాధి నిర్దారణ చేస్తారని, చికిత్సను వెంటనే ప్రారంభిస్తారని వివరించారు. అనుమానిత వ్యక్తుల రక్త నమూనాలను పరీక్షించేందుకు జిల్లాలో ఎక్కడెక్కడ టెస్టింగ్ సెంటర్లను ప్రారంభించేదీ బుదవారం నిర్దారణ అవుతుంద న్నారు. ముఖ్యంగా జ్వరపీడితులు పరిశుభ్రమైన మంచినీటిని ఎక్కువమోతాదులో తాగాలని, వైద్యుల సూచనల మేరకు పారా సిటమాల్ తదితర ఔషధాలను తీసుకోవడంతో పాటు, ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలేకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.