బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చొద్దు

ABN , First Publish Date - 2023-03-26T00:31:16+05:30 IST

బోయ, వాల్మీకిలను ఎస్సీలో చేర్చొద్దని, గిరిజన జాబితాలో చేర్చాలనే అసెంబ్లీ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని గిరిజన సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.

బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చొద్దు
బుట్టాయగూడెంలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేస్తున్న నాయకులు

అసెంబ్లీ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలి : గిరిజన నాయకులు

బుట్టాయగూడెం, మార్చి 25 : బోయ, వాల్మీకిలను ఎస్సీలో చేర్చొద్దని, గిరిజన జాబితాలో చేర్చాలనే అసెంబ్లీ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని గిరిజన సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ తీర్మానాన్ని నిరశిస్తూ బుట్టాయగూడెం బస్టాండ్‌ సెంటరులో మండల అధ్యక్షుడు కారం భాస్కర్‌ అధ్యక్షతన ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు. జిల్లా అధ్యక్షుడు తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీని గెలిపించి బ్రహ్మరథం పట్టిన గిరిజనులపై జగన్మోహనరెడ్డికి గౌవరం లేదన్నారు. గిరిజన వ్యతిరేక విధానాలు అమలు చేయడం బాధాకరమన్నారు. రాజకీయ లబ్ధికోసం రెండు కులాలను ఎస్టీ జాబితాలో చేర్చి ఆదివాసీలకు తీరని అన్యాయం చేశారన్నారు. ఏకసభ్య కమిషన్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని ఉపసంహరిచుకోవాలని లేకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు. నాయకులు తామా ముత్యాలమ్మ, మొడియం నాగమణి, మడకం గంగరాజు, పట్ల రమేష్‌కుమార్‌రెడ్డి, సరియం దుర్గ, జయలక్ష్మి, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

కుక్కునూరులో..

కుక్కునూరు, మార్చి 25 : బోయ, వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని ఆదివాసీ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుం దని ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు మడకం వెంకటేశ్వరరావు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అసెంబ్లీలో ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చు తూ సీఎం తీర్మానం ప్రవేశపెడుతున్నప్పుడు గిరిజన ఎమ్మెల్యేలు ఎందుకు అడ్డుకోలేదన్నారు. ఆదివాసీల ఓట్లు మీకు వద్దా, ఆదివాసీ గ్రామాల్లో ఎలా తిరుగుతారో చూస్తాం అంటూ హెచ్చరించారు.

Updated Date - 2023-03-26T00:31:16+05:30 IST