పెద్దమ్మ ఇంటిలోనే దోపిడీ

ABN , First Publish Date - 2023-03-19T00:32:59+05:30 IST

ఏలూరు జిల్లా నిడమర్రులో ఇల్లు కట్టుకుందామని దాచుకొన్న బంగారాన్ని అపహరించిన దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలను, వారి నుంచి రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలతోపాటు కారు, కత్తులు, ఐరన్‌ రాడ్డును స్వాధీనం చేసుకున్నారు.

పెద్దమ్మ ఇంటిలోనే దోపిడీ
స్వాధీనం చేసుకున్న బంగారం.. నిందితులతో జిల్లా ఎస్పీ

ప్లాన్‌ చేసిన దూరపు బంధువు.. వృద్ధురాలిని కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కేసి

బంగారం అపహరించిన నలుగురు యువకులు.. పోలీసుల దర్యాప్తు

ముగ్గురు పాత నేరస్థుల సహా బంధువు అరెస్ట్‌..

రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు

స్వాధీనం : జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ

ఏలూరు రూరల్‌, మార్చి 18 : ఏలూరు జిల్లా నిడమర్రులో ఇల్లు కట్టుకుందామని దాచుకొన్న బంగారాన్ని అపహరించిన దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలను, వారి నుంచి రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలతోపాటు కారు, కత్తులు, ఐరన్‌ రాడ్డును స్వాధీనం చేసుకున్నారు. ఏలూరులోని తన కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలివి. నిడమర్రుకు చెందిన కత్తుల జానకమ్మ (90), పెద్ద కూతురు, అల్లుడుతో కలిసి నివసిస్తోంది. చిన్న కూతురు ఇజ్రాయిల్‌లో ఉంటూ అక్కడి నుంచి ఇల్లు కట్టుకునేందుకు బంగారాన్ని పంపిస్తోంది. దీనిని బీరువాలో భద్రపరిచారు. మంగళవారం ఉదయం పెద్దకూతురు, అల్లుడు పనిమీద వేరే ఊరు వెళ్లారు. ఇంతలో ముగ్గురు యువకులు వచ్చి ఆమెను కట్టేసి, నోటిలో గుడ్డలు కుక్కి బంగారాన్ని అపహరించారు. తర్వాత ఊరి నుంచి వచ్చిన అల్లుడు, కూతురు ఆమెను కాపాడి పోలీసుల కు ఫిర్యాదుచేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీ సులు అనుమానితులపై నిఘా పెట్టారు.

వారు పాత నేరస్తులే

కారు నడుపుతూ జీవనం సాగిస్తున్న ఉంగుటూరుకు చెందిన కొమ్మన శ్రీనుకు రాజమండ్రికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి మట్టపర్తి రాజ్‌కుమార్‌తో పరిచయం ఉంది. వీరికి ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో ఇద్దరూ కలిసి గుప్త నిధుల కోసం డబ్బులు ఖర్చుచేసి అప్పులపాలయ్యారు. కోరుకొండ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన డీజిల్‌ ఆయిల్‌ దొంగతనం కేసులో రాజమండ్రి సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తూ రాజ్‌కుమార్‌ బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఇతనికి అక్కడే కాకినాడకు చెందిన సాయి రవికాంత్‌, అరుణ్‌కుమార్‌ పరిచయమయ్యారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ వీరిద్దరూ గతంలో హత్య చేసి బంగా రం అపహరణతోపాటు మరికొన్ని దొంగతనాల కేసులున్నాయి. జైలు శిక్ష అనుభవించారు. వీరు ముగ్గురికి శ్రీను జతయ్యాడు. కారు నడపడం ద్వారా వచ్చే ఆదాయం సరిపోక ఎలాగైనా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. తన దూరపు బంధువు, వరుసకు పెద్దమ్మ అయ్యే జానకమ్మ నిడమర్రులో ఉంటుం దని, ఆమె కూతురు గల్ఫ్‌లో ఉంటూ వచ్చినప్పుడల్లా పెద్ద ఎత్తున బంగారం తెస్తోందని శ్రీనుకు తెలిసింది. ఈ బంగారాన్ని అపహరించాలని అనుకున్నాడు. ఈ ముగ్గురికి విషయాన్ని తెలిపాడు. నలుగురు పథకం వేసి.. ఈ నెల 14న ఇంట్లో ఎవ రూ లేని సమయంలో జానకమ్మను కాళ్లూ చేతులు కట్టి నోట్ల గుడ్డలు కుక్కి బంగారు ఆభరణాలను అపహరించారు. వాటి తో ఎవరి ఊళ్లకు వారు వెళ్లిపోయారు. శనివారం ఉదయం రాజ్‌కుమార్‌ తన బైక్‌పై అరుణ్‌కుమార్‌, సాయి రవికాంత్‌ కలిసి గణపవరం మండలం సరిపల్లి వచ్చారు. వీరి ప్రవర్తన పై అనుమానం కలిగిన పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారిం చడంతో ఈ దోపిడీ గుట్టు రట్టయ్యింది. వారిని అరెస్టు చేసి, 650 గ్రాముల బంగారు ఆభరణాలు, ఆల్టో కారు, ఒక బైక్‌, రెండు సంచులు, నాలుగు సెల్‌ఫోన్లు, ఒక కత్తి, ఐరన్‌ రాడ్డును స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. సమావేశంలో గణపవరం సీఐ సుభాష్‌, డీఎస్పీ పైడేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T00:32:59+05:30 IST