భర్తే కాలయముడా ?
ABN , Publish Date - Dec 22 , 2023 | 12:26 AM
పెళ్ళి అయ్యి నాలుగు రోజులైన నూతన వధువువరులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో గురువారం గోదావరిలో సత్యవాణి(19) మృతదేహం లభ్యమైంది.
గోదారిలో దూకిన మహిళ మృతదేహం లభ్యం
భర్తే కారణమంటూ బంధువుల ఆందోళన
పోలీసుల హామీతో విరమణ
పెనుగొండ, డిసెంబరు 21: పెళ్ళి అయ్యి నాలుగు రోజులైన నూతన వధువువరులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో గురువారం గోదావరిలో సత్యవాణి(19) మృతదేహం లభ్యమైంది. వివరాలివి.. ఈనెల 15న వివాహమైన వధూవరులు మంగళవారం సాయంత్రం సినిమాకు వెళుతున్నామని ఇంటిలో చెప్పి బైక్పై బయలుదేరిన నవ దంపతులు ఇద్దరూ గోదావరిలోకి దూకిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం ఆమె మృతదేహం జాలర్లకంట పడడంతో వెలికి తీశారు. ఆమె బంధువులు మాట్లాడుతూ మా అమ్మాయికి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని దీనికి కారణం భర్తే అని సిద్ధాంతం జాతీయ రహదారిపై బైఠాయించి న్యాయం చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ రమేశ్ కేసు దర్యాప్తు చేస్తున్నామని నిజానిజాలు త్వరలో తెలుస్తాయని, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతదేహాన్ని తణుకు ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ‘నీ వంటే నాకు ఇష్టం లేదని దాంపత్యానికి సహకరించకపోవడంతోనే చనిపోవాలనుకుని ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాము’ అని భర్త పోలీసులకు తెలిపినట్టు సమాచారం. భార్యభర్తలు ఇద్దరూ బ్రిడ్జిపై నుంచి దూకినప్పుడు శివరామకృష్ణ కిలో మీటరు మేర సిద్ధాంతం వరకు ఎలా ఈదుతాడు... వధువు జోళ్ళు వేరే చోట ఉండడం ఏమిటని వీరిద్దరికి ఇంకా ఎవరైనా సహకరించారా.. పలు అనుమానాలను వధువు తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహం లభ్యం కావడంతో నరసాపురం డీఎస్పీ కె.రవిమనోహరాచారి ఘటనా స్థలానికి చేరుకుని బంధువుల నుంచి కారణాలను తెలుసుకున్నారు.