బెట్టింగుల జోరు
ABN , First Publish Date - 2023-10-09T00:14:06+05:30 IST
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహిస్తున్న క్రికెట్ ప్రపంచకప్ 2023 మ్యాచ్లపై జిల్లాలో భారీగా బెట్టింగులు జోరందుకున్నాయి.
క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్లు జరుగుతున్నా చలనం లేని పోలీసులు
ఏలూరు నగరంలో ఒక విద్యార్థి గతంలో క్రికెట్ బెట్టింగులు కట్టి అప్పులపాలై చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. మరో యువకుడు క్రికెట్ బెట్టింగులతో అప్పులపాలై గత ఏడాది రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటువంటి ఘటనలు జరుగుతున్నా జిల్లాలో బెట్టింగ్లు మాత్రం యథేచ్ఛగా జరుగుతున్నాయి. పోలీసుల నిఘా వైఫల్యంతో మరింత జోరందుకున్నాయి.
ఏలూరు క్రైం, అక్టోబరు 8 : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహిస్తున్న క్రికెట్ ప్రపంచకప్ 2023 మ్యాచ్లపై జిల్లాలో భారీగా బెట్టింగులు జోరందుకున్నాయి. మనదేశంలోనే ఈ మ్యాచ్లు జరుగుతుండడంతో ఇప్పటికే ప్రధాన కేంద్రాల్లో ఉన్న క్రికెట్ బుకీలతో పరిచయాలున్న జిల్లాలోని క్రికెట్ బుకీలు తమదైన శైలిలో హవా కొనసాగిస్తున్నారు. క్రికెట్ బెట్టింగు రాయుళ్లు అమాయకపు ప్రజలను ఎరగా చేసుకుంటున్నారు. ఆటపై ఉన్న మోజును వారు సొమ్ము చేసుకోవడానికి బెట్టింగులను కట్టిస్తున్నారు. క్రికెట్ బెట్టింగులు కొన్నేళ్ల నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఒకనాడు బెట్టింగ్ కట్టిన వ్యక్తి నేడు క్రికెట్ బుకీలుగా మారిపోతున్నారు. పోలీసులు బెట్టింగ్ కట్టిన వ్యక్తిపై సరైన చర్యలు తీసుకోకపోవడంతోనే బుకీగా మారిపోతున్నాడని విమర్శలు కూడా ఉన్నాయి. జిల్లాలోని విద్యార్థులు, యువకులను ఆకర్షింపచేసి బెట్టింగులవైపు వారి దృష్టి పెట్టించి చివరకు అప్పుల పాలు చేయించేస్తున్నారు. వృత్తి విద్యాసంస్థలు ఉన్న ప్రాంతాల్లోనూ విద్యార్థులను టార్గెట్ చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా ఏలూరు నగరం, జంగారెడ్డిగూడెం, నూజివీడు ప్రాంతాల్లో జరుగుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి.
నాటి బెట్టింగ్దారులే నేడు బుకీలు..
ఒకనాడు క్రికెట్ బెట్టింగులు కట్టిన వారే నేడు బుకీలుగా అవతారం ఎత్తేశారు. గతంలో జిల్లాలో బెట్టింగులు కట్టిన సమయంలో ఏ విధంగా ఎంత పర్సంట్ ఇస్తున్నారో తెలుసుకుని వీరే చివరకు ప్రధాన కేంద్రంలో ఉన్న బుకీలతో సంబంధాలు పెట్టుకుని నేరుగా తమకు ఉన్న పరిచయస్తులతో బెట్టింగులు కట్టిస్తున్నారు. ఏలూరు నగరంలో గతంలో పట్టుబడిన వారిలో ఒక బుకీ ఇంట్లో ఏకంగా క్రికెట్ బెట్టింగు సొమ్ములు లెక్క పెట్టడానికి టెల్లర్ కౌంటింగ్ మిషన్లు ఉండడంతో పోలీసులే ఆశ్చర్యానికి గురయ్యారు. నగరంలో పలువురిపై రౌడీ షీట్లు ఉన్నప్పటికీ వారిని క నీసం స్టేషన్కు పిలిచిన ఆనవాళ్లే లేవు. గతంలో ఏమైనా క్రికెట్ మ్యాచ్లు జరిగినప్పుడు వారిని ముందే పిలిచి వారు ఎక్కుడ ఉంటున్నారో, వారి ఫోన్లు అందుబాటులో ఉండాలని, ఏ క్షణం ఫోన్ చేసినా లిప్టు చేయాలని పోలీసులు హెచ్చరికలు చేసేవారు. ఎవరైనా ఫోన్ స్విచ్ ఆఫ్చేస్తే సహించేదిలేదని షీటర్లకు హెచ్చరికలు జారీ చేసేవారు. ప్రస్తుతం ఒక్కసారి అయినా వీరికి పోలీసు పిలుపు లేదనే విమర్శలు వస్తున్నాయి. గతంలో లాడ్జీల్లో బెట్టింగులు నిర్వహించేవారు. అప్పట్లో క్రికెట్ మ్యాచ్లు జరిగినప్పుడల్లా లాడ్జీలను తనిఖీలు చేసే వారు. నేడు ప్రపంచకప్ కోసం మ్యాచ్లు జరుగుతు న్నా ఒక్కరోజు కూడా ఎక్కడా లాడ్జీలు తనిఖీ చేసినట్టుగా సమాచారమే లేదు. స్టేషన్ పరిధిలో ఎంతమంది క్రికెట్ బుకీలు ఉన్నారో కూడా ప్రస్తుతం ఆ స్టేషన్ల వారికే తెలియని పరిస్థితి నెలకొందంటే వీరిపై నిఘా ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
బెట్టింగ్లకు అడ్డాలుగా..
జిల్లాలోని కొన్ని బార్లు, హోటళ్ళు, దాబాలు, కిళ్లీ షాపులు, మోటారు మెకానిక్ షెడ్లు, కొన్ని టైలరింగ్ షాపులను తమ అడ్డాగా మార్చుకుని క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇంకా కొంతమంది రూములను తీసుకుని బెట్టింగులు కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఆదివారం జరిగిన ఇండియా–ఆస్ట్రేలియా మ్యాచ్పై జిల్లాలో అత్యధికంగా కోట్ల రూపాయలు బెట్టింగులతో చేతులు మారాయని ప్రచారం ఉంది. ఈనెల 14వ తేదీన ఇండియా–పాకిస్థాన్కు జరిగే మ్యాచ్లో మరింత ఎక్కువ బెట్టింగులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువ శాతం ఇండియా వైపే బెట్టింగులు కడతారని ప్రచారం కూడా ఉంది. ఈనెల 17న బంగ్లాదేశ్, నవంబరు 2న శ్రీలంకతోను, 5న సౌత్ ఆప్రికాతో, 12 నెదెర్లాండ్తో భారత జట్టు ఆడనుంది. 2011లో జరిగిన ప్రపంచ కప్లో ఇండియా ప్రపంచ చాంపియన్గా వర్ధిల్లింది. ప్రస్తుతం ఇండియాలోనే ఐసీసీ క్రికెట్ మ్యాచ్ 2023 జరుగుతుండడంతో ఈసారి కూడా ఇండియా ఆ కప్పు సాధిస్తుందని ఇప్పటికే బెట్టింగులు జోరందుకున్నాయి. ఫైనల్ మ్యాచ్ నవంబరు 19న జరుగనుంది. ఇక ఆరోజు జరిగే బెట్టింగులు అంతా ఇంతా కాదు.
కొరవడిన పోలీసుల నిఘా..
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బెట్టింగు రాయుళ్ళపై గట్టి నిఘా పెట్టి కౌన్సెలింగ్లు కూడా నిర్వహిస్తున్నారు. విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు. ఏలూరు జిల్లాలో మాత్రం క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులే లేరన్నట్టు పోలీసులు వ్యవహరించడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిఘా విభాగాలు కూడా వైఫల్యం చెందుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో తనిఖీలు లేకపోవడం, కేసులు పెట్టకపోవడంతో అంతా ప్రశాంతంగా ఉందని పోలీస్ శాఖ అనుకుంటున్నా వాస్తవానికి యథేచ్ఛగా బెట్టింగులు జరుగుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. బెట్టింగులు కడితే సొమ్ములు వస్తాయని ఆశపడిన పలువురు తమకు ఉన్న సొమ్మును కట్టి పోగొట్టుకుని నష్టపోతున్నారు. ఇప్పటికే బుకీలు చాలా మంది నగరాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్లారని చెప్తున్నా వాస్తవానికి రహస్య ప్రదేశాల్లో ఉంటూ వీరు క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తున్నారని ప్రచారం ఉంది. షీట్లు ఉన్న వారిని మ్యాచ్లు జరిగే సమయంలో పోలీసులు వారికి కౌన్సెలింగ్ చేసి వారిపై నిఘా ఉంచాల్సి ఉంది. కానీ ఇవి ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణం క్రికెట్ బుకీలపై నిఘా ఏర్పాటు చేసి అమాయక ప్రజలను వారి వలలో పడకుండా కాపాడాలని పలువురు కోరుతున్నారు.