Share News

మళ్లీ కొవిడ్‌

ABN , Publish Date - Dec 22 , 2023 | 12:30 AM

రెండేళ్ల విరామానంతరం జిల్లాలో తొలి కొవిడ్‌–19 పాజిటివ్‌ కేసు నమోదైంది. ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యుడికి కొవిడ్‌ పాజిటివ్‌ గురువారం నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.

మళ్లీ కొవిడ్‌

ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో వైద్యుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ

ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు

నేడు జిల్లాకు 10 వేల కొవిడ్‌ టెస్టు కిట్‌లు

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 21 : రెండేళ్ల విరామానంతరం జిల్లాలో తొలి కొవిడ్‌–19 పాజిటివ్‌ కేసు నమోదైంది. ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యుడికి కొవిడ్‌ పాజిటివ్‌ గురువారం నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఆస్పత్రిలోని ఐసీయూ విబాగంలో పనిచేస్తున్న ఓ వైద్యుడికి ర్యాండమ్‌ టెస్టుచేయగా పాజిటివ్‌గా తేలిందని వివరించాయి. ప్రస్తుతం ఐసోలేషన్‌లోవున్న ఆ వైద్యునికి కొవిడ్‌ లక్షణాలేవీ లేవని, అయితే వైరస్‌ నిర్ధారణ పరీక్షలో మాత్రం పాజిటివ్‌ వచ్చిందని తెలిపాయి. ఐసోలేషన్‌లోవున్న వైద్యుని ఆరోగ్యస్థితి స్థిరంగానే ఉందని, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని వివరించాయి. వేరియంట్‌ను తెలుసుకునే నిమిత్తం వైద్యుడి నుంచి సేకరించిన శ్వాబ్‌ను హైదరాబాద్‌లోని జినోమ్‌ సిక్వెన్సింగ్‌ ల్యాబ్‌కు పంపనున్నట్టు తెలిపారు. తాజాగా దేశవ్యాప్తంగా కొవిడ్‌–19 కొత్త వేరియంట్‌ జేఎన్‌–1 కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో జిల్లాలో కొత్తగా పాజిటివ్‌ కేసు వెలుగులోకి రావడం వైద్యఆరోగ్యశాఖను కలవరానికి గురిచేసింది. ఆశ్రం ఆస్పత్రిలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసు గురించిన సమాచారాన్ని జిల్లా అధికారులు గురువారం రాష్ట్ర అధికారులకు చేరవేశారు. ఆ వెంటనే ప్రతీ రెండుగంటలకోసారి పాజిటివ్‌ కేసు బాధితుడి ఆరోగ్యస్థితి గురించి రాష్ట్ర అధికారులు ఆరాతీస్తూ సూచనలు ఇస్తున్నారు. కాగా జిల్లాలో ప్రస్తుతం కొవిడ్‌ వైరస్‌ నిర్ధారణ కిట్‌లు ఒక్కటికూడా లేనివిషయాన్ని డీఎంహెచ్‌వో కార్యాలయ అధికారులు రాష్ట్రానికి తెలపగా, శుక్రవారం జిల్లాకు పదివేల కిట్‌లను పంపనున్నట్టు సమాచారం అందింది.

Updated Date - Dec 22 , 2023 | 12:31 AM