పెరిగిన మినుము ధరలు
ABN , First Publish Date - 2023-08-29T00:40:51+05:30 IST
మినుముల ధరలు వారం రోజులుగా పెరగడంతో మినుములు పండించిన రైతుల మోములో ఆనందం వ్యక్తమవుతోంది.
క్వింటాలు ధర రూ.9 వేలు
ముదినేపల్లి రూరల్, ఆగస్టు 28 : మినుముల ధరలు వారం రోజులుగా పెరగడంతో మినుములు పండించిన రైతుల మోములో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం క్వింటాలు ధర రూ.9 వేలు ఉండడంతో పూర్తి స్థాయిలో గిట్టుబాటు అవుతోందని రైతులు పేర్కొంటున్నారు. అయితే మరోవైపు ఇప్పటికే సన్న, చిన్న కారు రైతులు తమ వద్ద ఉన్న మిను ములను తక్కువ ధరకే విక్రయించి నష్టపోయామని లబోదిబోమం టున్నారు. అకాల వర్షం కారణంగా మినుములు గుట్టల మీద ఉన్న తరుణంలో వర్షానికి తడిశాయి. దీంతో అధిక శాతం మంది రైతులు రంగు మారాయన్న ఆందోళనతో క్వింటాలు రూ.6 వేల నుంచి రూ.6,500 మధ్య విక్రయించి నష్టపోయారు. ముఖ్యంగా కౌలు రైతులు అయినకాడికి పంట అమ్ముకోవడంతో వారికి నష్టమే మిగిలింది. పెద్ద రైతులు వద్ద నిల్వ ఉన్న మినుములకు ధర దక్కుతుందని తాము మాత్రం ప్రతీ ఏడాది నష్టాలకు గురవుతున్నామని కౌలు రైతులు వాపోతున్నారు. మినుముల ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది వర్షాలకు మినుములు తడిచిరంగు మారడంతో ఉన్న మంచి మినుములకు డిమాండ్ ఏర్పడి ధరలు పెరుగుతున్నాయని ఎగుమతి దారులు చెబుతున్నారు. అయితే ధరలు ఇలాగే పెరిగితే విత్తనాలకు డిమాండ్ ఏర్పడి కొనలేని పరిస్థితి ఏర్పడుతుందని సన్న, చిన్నకారు రైతులు చెబుతున్నారు.