సమ్మె పరిష్కరించకుంటే వైసీపీ ఇంటికే..
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:23 AM
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లాలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె శనివారం నాటికి ఐదో రోజుకు చేరుకుంది.
అంగన్వాడీల హెచ్చరిక.. ఐదో రోజుకు సమ్మె
ఏలూరు కలెక్టరేట్, డిసెంబరు 16 : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లాలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె శనివారం నాటికి ఐదో రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మెను విరమించబోమని స్పష్టం చేశారు. పలుచోట్ల అంగన్వాడీ సెంటర్ల తాళా లను అధికారులు పగులకొట్టారు. ఈ చర్యలను ఖండిస్తూ కొన్ని ప్రాంతాల్లో అంగన్వాడీలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఏలూరులో సమ్మె శిబిరంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు సమస్యలు పరిష్కరించకపోతే వైసీపీ ఇంటికి పోవడం ఖాయమని హెచ్చరించారు. సమ్మెలో భాగంగా కలెక్టరేట్ వద్ద ఆకలి బాధలతో గడ్డి, ఆకులు తింటున్నట్టు అంగన్వాడీలు వినూత్నంగా నిరసన తెలిపారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ మాట్లాడుతూ అంగన్వాడీలు విజయం సాధించేవరకు పోరాడటమే సాబ్జీకి ఇచ్చే ఘనమైన నివాళి అన్నారు. తొలుత ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆలీ, కార్యదర్శి రవి కుమార్, బండి వెంకటేశ్వరరావు, అంగన్వాడీ యూనియన్ నాయకులు భవాని, అరుణ, రామలక్ష్మి, ఐద్వా అధ్యక్షులు హైమావతి, శ్యామలరాణి, తదితరులు పాల్గొన్నారు.
తాళం పగులగొడితే పెట్రోల్ పోసుకుంటా..
చింతలపూడి : చింతలపూడి ఫైర్స్టేషన్ సెంటర్లో నిర్వహిస్తున్న నిరసన శిబిరానికి లబ్ధిదారులు చంటి పిల్లలతో తరలివచ్చి అంగన్వాడీ కార్యకర్తల సమ్మెకు మద్దతు తెలిపారు. శిబిరం వద్ద మాకు అంగన్వాడీ తల్లులు కావాలంటూ ప్లకార్డులతో పిల్లలు ప్రదర్శన జరుపుతూ నినాదాలు చేశారు. రాజశేఖరరెడ్డి విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం పోలీస్స్టేషన్కు వెళ్లి అంగన్వాడీ సెంటర్ల తాళాలను గుర్తు తెలియని వ్యక్తులు పగులకొడుతున్నారని, రికార్డులు, సరుకులు చెల్లాచెదురు చేస్తున్నారని ఆరోపిస్తూ పోలీస్స్టేషన్ అంగన్వాడీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఫాతిమాపురం సెంటర్లో తాళాలు పగులకొట్టడానికి వచ్చిన అధికారులకు అక్కడ పనిచేసే కార్యకర్త తాళాలు పగులకొట్టవద్దని, అలా చేస్తే తాను పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుంటానని హెచ్చరించడంతో వచ్చిన సిబ్బంది వెనుతిరిగారు. కొద్దిసేపటికి పోలీసుల సహకారంతో అధికారుల బృందం వచ్చి తాళాలు తెరిచారు.దీంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. మండ లంలో 93 అంగన్వాడీ కేంద్రాల్లో 41 కేంద్రాల్లో ప్రభుత్వం నిర్దేశించిన బృందాలు తాళాలు తీశారని, వీటిలో 281 మంది స్కూలు పిల్లలకు ఆహారం అందించినట్టు ఇన్చార్జి ఐసీడీఎస్ సూపర్వైజర్ లీలా కుమారి తెలిపారు.