గుక్కెడు నీటికి అల్లాడుతున్నాం

ABN , First Publish Date - 2023-06-03T00:34:39+05:30 IST

గ్రామంలో కొళాయిల ద్వారా చుక్కనీరు రావడం లేదని, గొంతు తడుపుకొందా మనుకుంటే గుక్కెడు నీరు కూడా దొరకడం లేదని మండలంలోని గంగాడ గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం గ్రామంలోని సచివాలయాన్ని సెగిడి వీధి, కొండవీధికి చెందిన మహిళలు ముట్టడించారు.

 గుక్కెడు నీటికి అల్లాడుతున్నాం
సచివాలయం వద్ద ఖాళీ బిందెలతో ఆందోళన చేస్తున్న మహిళలు

సీతానగరం, జూన్‌ 2: గ్రామంలో కొళాయిల ద్వారా చుక్కనీరు రావడం లేదని, గొంతు తడుపుకొందా మనుకుంటే గుక్కెడు నీరు కూడా దొరకడం లేదని మండలంలోని గంగాడ గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం గ్రామంలోని సచివాలయాన్ని సెగిడి వీధి, కొండవీధికి చెందిన మహిళలు ముట్టడించారు. ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని కొళాయిలు, పైప్‌లైన్లు ఉత్సవ విగ్రహంలా ఉన్నాయని, వాటిద్వారా నీరు రావడం లేదని తెలిపారు. తప్పని పరిస్థితుల్లో బావి నీరు తెచ్చుకుంటున్నామన్నారు. దీనివల్ల రోగాల బారిన పడుతున్నామని వాపోయారు. ఈ విషయాన్ని అనేకసార్లు నాయకులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. ఎప్పటికైనా స్పందించి తాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై గ్రామ సర్పంచ్‌, సచివాలయ సెక్రటరీ స్పందిస్తూ.. నాలుగు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హమీ ఇవ్వడంతో మహిళలు వెనుదిరిగారు. కార్యక్రమంలో సీపీఎం నాయకుడు యమ్మల మన్మథరావు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:34:39+05:30 IST