స్కానింగ్ సెంటర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ABN , First Publish Date - 2023-05-26T00:16:42+05:30 IST
జిల్లాలో స్కానింగ్ సెంటర్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని డీఎంహెచ్వో డాక్టర్ ఎస్వీ రమణకుమారి స్పష్టంచేశారు. తన కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు.

డీఎంహెచ్వో రమణకుమారి
విజయనగరం రింగురోడ్డు, మే 25: జిల్లాలో స్కానింగ్ సెంటర్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని డీఎంహెచ్వో డాక్టర్ ఎస్వీ రమణకుమారి స్పష్టంచేశారు. తన కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ప్రభుత్వ స్కానింగ్ సెంటర్లు 15,ప్రైవేటు స్కానింగ్ సెంటర్లు 81 వున్నాయన్నారు. ఆ సెంటర్లలో ఇచ్చిన ప్రతి బిల్లు, రిపోర్టులపై లింగనిర్ధారణ చట్టరీత్యా నేరమని ముద్రించాలన్నారు. అదే విధంగా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ధరల పట్టికను ప్రదర్శించాలన్నారు. జిల్లాలో రిజిస్ట్రేషన్ లేకుండా ఏ స్కానింగు సెంటర్ నడిపినా, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్కానింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.పీసీపీఎన్డీటీ.ఏపీ.జీఓవీ.ఇన్ ద్వారా) తెలిపారు. లింగనిర్ధారణ పరీక్షలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు లింగనిర్ధారణను కోరే వ్యక్తులకు మూడు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల నుంచి 1,00,000 జరిమానా విధిస్తామని, ఆ స్కానింగ్ సెంటర్ రిజిస్ట్రేషన్ను రద్దు చేస్తామని హెచ్చరించారు.